జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ వేగవంతం అయ్యింది.గత నాలుగు రోజులుగా పులివెందులలో సిబిఐ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా అనుమానితులు, సాక్షులు అనేక మందిని కలిసి విచారిస్తూ , ఈ కేసును ఒక కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.అసలు ఈ కేసు ఎప్పుడో సీబీఐ పరిధిలోకి వెళ్ళినా, పెద్దగా కదలిక కనిపించలేదు.
అయితే రాజకీయంగా ఇది ప్రాధాన్యమున్న అంశం కావడంతో పాటు , ప్రస్తుతం తిరుపతిలో బిజెపి వైసిపి మధ్య పోటీ తీవ్రంగా ఉండడం, ఈ వ్యవహారం కారణంగా జగన్ ఇబ్బంది పడే అవకాశం ఉండటంతో , బిజెపి సిబిఐ ద్వారా జగన్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఈ కేసులో తమకు న్యాయం జరగడం లేదని, పదేపదే మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఢిల్లీకి వెళ్లి మరి హడావుడి చేయడం, ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు ఇలా అనేక కారణాలతో ఈ కేసు దర్యాప్తు వేగవంతం అయ్యింది.
గత నాలుగు రోజులుగా పులివెందులలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సిబిఐ అధికారులు సాక్షులను విచారిస్తున్నారు.దీనిలో భాగంగానే మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి కుటుంబ సభ్యులను అధికారులు విచారించారు.
ఇతడు వివేకానందరెడ్డి పొలాన్ని గతంలో కౌలుకు తీసుకుని సాగు చేసుకునేవారు. అలాగే వివేక ఇంటి సమీపంలోని పాల డైరీ, సెల్ పాయింట్ యజమానులను సిబిఐ అధికారులు విచారణ చేసినట్లు తెలుస్తోంది.
ఏదిఏమైనా మరి కొద్ది రోజుల్లోనే ఈ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు సిబిఐ అధికారులు శరవేగంగా ప్రయత్నిస్తుండటంతో, ఈ అంశానికి రాజకీయ ప్రాధాన్యం పెరిగి పోయింది.
పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ ఈ కేసు విచారణ వేగవంతం కావడం చర్చనీయాంశంగా మారింది.ఇప్పటికే ఈ వ్యవహారంలో జగన్ పై టిడిపి, బిజెపి, జనసేన పార్టీలు ఆరోపణలు చేస్తున్న క్రమంలో , ఇప్పటికే జగన్ తల్లి విజయమ్మ బహిరంగ లేఖ రాశారు.అలాగే మొదటి నుంచి ఈ కేసు వ్యవహారంలో టిడిపి మాజీమంత్రి , ప్రస్తుత బీజేపీ నాయకుడిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి పైన అనేక ఆరోపణలు వస్తున్న క్రమంలో సీబీఐ ఈ కేసు వ్యవహారాన్ని ఏవిధంగా ముగింపు ఇస్తుందో అనేది ఉత్కంఠ కలిగిస్తోంది.