ఈ మధ్య కాలంలో సుశాంత్ మృతి కేసు సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కాదు.సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడో లేక ఎవరైనా హత్య చేశారో అధికారులకు, పోలీసులకు అర్థం కావడం లేదు.
మీడియాలో సుశాంత్ మృతి గురించి వేర్వేరు కథనాలు ప్రసారం అవుతున్నాయి.ఈ కథనాలలో వేటిని నమ్మాలో వేటిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి.
ప్రస్తుతం సీబీఐ అధికారులు సుశాంత్ మృతి కేసును దర్యాప్తు చేస్తున్నారు.
సుశాంత్ మృతి చెంది రెండున్నర నెలలు గడిచినా ఈ కేసులో చాలా విషయాలు కొలిక్కి రావడం లేదు.
ముంబై నుంచి సీబీఐ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా కొన్ని ప్రముఖ ఛానెళ్లలో సుశాంత్ ది మర్డర్ కాదు అని కథనాలు ప్రసారమయ్యాయి.ఈ విధంగా ప్రసారమవుతున్న కథనాలు నెటిజన్లను గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి.
దీంతో మీడియాలో వస్తున్న కథనాల గురించి సీబీఐ అధికారులు తాజాగా స్పందించారు.
సీబీఐ వర్గాలు సుశాంత్ ది మర్డర్ కాదని చెప్పినట్టుగా ప్రసారమవుతున్న వార్తలు నిజం కాదని చెప్పారు.
సీబీఐ ఇప్పటివరకు ఏ మీడియా సంస్థతోనూ సుశాంత్ మృతి గురించి చర్చించలేదని మీడియాలో ప్రసారమవుతున్న వార్తలు పూర్తిగా కల్పితమని, ఊహాజనితమని అధికారులు వెల్లడించారు.సుశాంత్ మృతి కేసులో ఒక పద్ధతి ప్రకారం దర్యాప్తు జరుగుతోందని దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎటువంటి సమాచారాన్ని ఇతరులతో పంచుకోబోమని సీబీఐ తేల్చి చెప్పింది.
సీబీఐకు సంబంధించిన వ్యక్తులెవరూ సుశాంత్ కేసుకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు వెల్లడించలేదని ప్రకటించింది.సీబీఐ అధికారులు స్పష్టత ఇవ్వడంతో టీవీ ఛానెళ్లలో ప్రసారమైన కథనాలు నిజం కాదని ప్రూవ్ అయింది.