వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు టార్గెట్ గా ఇప్పుడు సిబిఐ దాడులు జరుగుతుండడం, ఆయన గతంలో కొన్ని లావాదేవీల్లో బ్యాంకులను మోసం చేశారనే అభియోగాలతో ఇప్పుడు అకస్మాత్తుగా సిబిఐ ఆయనపై దృష్టి పెట్టింది.బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టారనే కారణాలతో కారణాలతో, ఆయా బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పుడు సిబిఐ రంగంలోకి దిగి, రాజుగారి లెక్కలు మొత్తం బయట పెట్టే పనిలో ఉంది.
ఈ దాడులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ఏ సంబంధం లేదని వార్తలు వస్తున్నా, అకస్మాత్తుగా ఈ దాడులు జరగడం వెనుక రాజకీయ కారణాలు ఉండొచ్చనే విశ్లేషణలు ఇప్పుడు ప్రారంభమయ్యాయి.ఎందుకంటే గత కొంత కాలంగా రఘురామకృష్ణంరాజు అదేపనిగా ఏపీ ప్రభుత్వాన్ని, జగన్ ను, ఆ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు.
మొదట్లో ఆయన విమర్శలకు వైసీపీ నాయకులు గట్టిగానే స్పందించినా, ఆ తర్వాత జగన్ ఆదేశాలతో ఆయనను పట్టించుకోవడం మానేసారు.దీంతో ఢిల్లీ కేంద్రంగా ఆయన జాతీయ మీడియాకు, తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ, వైసీపీ ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా అభాసుపాలు చేస్తున్నాడు అనే ఆందోళన వైసీపీలో నెలకొంటూ వచ్చింది.
ఏదోరకంగా ఆయనపై అనర్హత వేటు వేయాలనే ఉద్దేశంలో జగన్ ఉంటూ వస్తున్నారు.అయితే రఘురామకృష్ణంరాజు కు బిజెపి అండదండలు ఉండడం వల్లే, ఆయన ఈ స్థాయిలో హడావుడి చేస్తూ వస్తున్నారని, ఆయన బీజేపీలో చేరతారని మొదటగా వైసిపి అంచనా వేసింది.
అయితే కొంత కాలంగా వైసీపీకి దగ్గర అయ్యేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తూ ఉండడం, ఏపీకి సంబంధించిన అన్ని వ్యవహారాల్లోనూ సహకరిస్తామనే సంకేతాలు పంపించడం వంటివి చేయడంతో పాటు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇచ్చి మరీ ఢిల్లీకి జగన్ ను పిలిపించుకున్నారు.ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలతో పాటు, వైసిపిలో చేరే విషయంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా లోకేష్, చంద్రబాబు పై సీబీఐ విచారణ చేయించాలనే డిమాండ్ సైతం జగన్ పెట్టారనే ప్రచారం జరిగింది.ఆ సందర్భంగానే రఘురామ కృష్ణంరాజును కట్టడి చేయాల్సిందిగా జగన్ ప్రధాని దగ్గర గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది.
ఆయన బిజెపి అండదండలు చూసుకునే ఈ విధంగా తమపై విరుచుకు పడుతున్నారు అని, ప్రధానికి సైతం ఫిర్యాదు చేశారని కూడా ఇప్పుడు వైసీపీలో చర్చ జరుగుతోంది. జగన్ చెప్పిన అన్ని విషయాలను మోదీ సానుకూలంగానే విన్నారని, ఆ ఎఫెక్ట్ ఇది అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొదటగా రఘురామకృష్ణంరాజు, తర్వాత లోకేష్, చంద్రబాబు వ్యవహారాలపై దృష్టి పెడతారని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉండడంతో, తెలుగుదేశం పార్టీలో మరింత ఆందోళన పెరిగిపోతూ వస్తోంది.