వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గురించి చెప్పుకుంటే ఆయన సొంత పార్టీ పైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ, జగన్ నిర్ణయాలు తప్పుపడుతూ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కంటే ఎక్కువ గా వైసీపీ ప్రభుత్వం లోపాలను ఎత్తిచూపుతూ, పదే పదే విమర్శలు చేస్తూ వస్తున్నారు.చాలాకాలంగా ఢిల్లీకే పరిమితం అయిన రఘురామకృష్ణంరాజు తనకు వైసీపీ నేతల నుంచి ప్రాణభయం ఉందని, తాను సొంత నియోజకవర్గమైన నరసాపురానికి వస్తే తనపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతూ, ఢిల్లీ నుంచి వైసీపీ పై రాజకీయ విమర్శలు చేస్తూ వస్తున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా రఘురామకృష్ణంరాజు పై సిబిఐ కేసు నమోదు చేసింది.చెన్నై ఎస్బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ రవి చంద్రన్ ఫిర్యాదు మేరకు రఘురామకృష్ణంరాజు పై ఈ కేసు నమోదైంది.
ఫోర్జరీ సంతకాలు, పత్రాలతో బ్యాంకులను మోసం చేసిన రఘురామకృష్ణంరాజు 237 కోట్ల రుణాలు ఎగ్గొట్టినట్టు గా సిబిఐకి ఫిర్యాదులు అందాయి.ఇంద్ భారత్ పవర్ లిమిటెడ్ డైరెక్టర్ గా ఉన్న రఘురామ కృష్ణంరాజు , ఇతర డైరెక్టర్లు గా ఉన్న కనుమూరి రమాదేవి, రాజ్ కుమార్, దుంపల మధు సుధన్ రెడ్డి, నారాయణ ప్రసాద్, రామచందర్ అయ్యర్ లపై సిబిఐ కేసు నమోదు చేసింది.
ఫోర్జరీ పత్రాలతో బ్యాంక్ రుణాలు పొంది, వాటిని పక్కదారి పట్టించినట్టుగా ఫిర్యాదు అందడంతో, దీనిపై సిబిఐ కేసు నమోదు చేసింది.
ఇప్పటికే అనేక బ్యాంకులను మోసగించినట్లు గా రఘురామకృష్ణంరాజు పై అనేక కేసులు ఉన్నాయి.ఆ కేసుల నుంచి తప్పించుకునేందుకే బీజేపీ వర్గాలతో సన్నిహితంగా ఉంటూ వైసీపీ పై విమర్శలు చేస్తున్నారు అనే ప్రచారం చాలాకాలం నుంచి ఉంది.అయితే ప్రస్తుతం సిబిఐ కేసు నమోదుతో రఘురామకృష్ణంరాజు బండారం బయటపడింది అని, ఒక్కో కేసులో ఇలా ఇరుక్కోవడం మంచిదే అని, తాము రఘురామ కృష్ణంరాజు విషయాన్ని పట్టించుకోకపోయినా , ఆయన చేసిన తప్పులే ఆయనకు శిక్ష వేస్తాయి అంటూ వైసీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ కొత్త కేసుల విషయంలో రాజు గారు బీజేపీ పెద్దలను ఆశ్రయించి ఊరట పొందుతారో లేదో చూడాలి.