టెక్ సపోర్ట్ను అందిస్తామనే సాకుతో దాదాపు 10 ఏళ్ల కాలంలో వేలాది మంది అమెరికన్లను మిలియన్ డాలర్లు మేర మోసగించిన ట్రాన్స్ నేషనల్ స్కామ్ను ఛేదించడంలో ఎఫ్బీఐకి ఢిల్లీ పోలీసులు, సీబీఐ అధికారులు సాయం చేశారు.న్యూఢిల్లీకి చెందిన హర్షద్ మదన్ (34), ఫరీదాబాద్కు చెందిన వికాస్ గుప్తా (33)లను సీబీఐ, ఢిల్లీ పోలీసులు ఈ వారంలో అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీకి చెందిన మరో నిందితుడు గగన్ లాంబా (41) పరారీలో వున్నాడు.గగన్ సోదరుడు జతిన్ లాంబా కూడా పోలీసుల అదుపులోనే వున్నాడు.
వైర్ మోసం, కంప్యూటర్ ఆధారిత మోసం, కుట్ర వంటి వాటిపై అభియోగాలు నమోదు చేశారు.
ట్రాన్స్ నేషనల్ టెక్ సపోర్ట్ స్కామ్ను ఛేదించడంలో సహకరించినందుకు సీబీఐ, ఢిల్లీ పోలీసులకు యూఎస్ అటార్నీ ఫిలిప్ ఆర్ సెల్లింగర్ ధన్యవాదాలు తెలిపారు.
ఇదే కేసులో భారత సంతతికి చెందిన మేఘనా కుమార్ (50) తన నేరాన్ని అంగీకరించారు.కెనడాలోని అంటారియోకు చెందిన 33 ఏళ్ల జయంత్ భాటియాను కూడా అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.
న్యూయార్క్లోని రిచ్మండ్ హిల్కు చెందిన కుల్విందర్ సింగ్ (34) మనీ లాండరింగ్కు కుట్ర పన్నారని, చట్టవిరుద్ధ కార్యకలాపాలతో ఆదాయాన్ని, ఆస్తిని పొందారని అతనిపై అభియోగాలు మోపారు.
ఈ హైటెక్ మోసం కుట్రలో పాల్గొన్నందుకు గాను భాటియాపై అభియోగాలు మోపారు.మొత్తం ఆరుగురు భారతీయులు, భారత సంతతికి చెందిన వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఈ హైటెక్ దోపిడీ పథకాన్ని అమలు చేయడానికి వ్యక్తిగత కంప్యూటర్లను ఉపయోగించుకున్నారని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు.పథకంలో భాగంగా ఈ ముఠా సభ్యులు సీనియర్ సిటిజన్లను వేటాడుతున్నారని, పనికిరాని కంప్యూటర్లను మరమ్మత్తు చేసినందుకు గాను రుసుము చెల్లించాలని వేధిస్తున్నారని సెల్లింగర్ చెప్పారు.