ఎక్కడలేని ప్రేమ, ఆప్యాయతలు ఒలకపోయడం అసాధ్యమైన వాగ్ధానాలను కూడా ఈజీగా చేసేస్తామంటూ చెప్పడం ఇవన్నీ రాజకీయ పార్టీల నాయకుల నోటినుంచి ఎన్నికల సమయంలో వినిపించే మాటలే.నాయకులు ఎన్ని వాగ్దానాలు చేసినా అవన్నీ ఓట్లకోసమే అన్నసంగతి అందరికి తెలిసిందే.
ఈ ఐదేళ్లపాటు ఏమి చేశామన్నది చెప్పకుండా గెలిపిస్తే రాబోయే ఐదేళ్లలో ఏమి చేయబోతున్నామో చెబుతూ రాజకీయ పార్టీలు ప్రజల ముందుకు వెళ్తున్నాయి.ఇక ఎన్నికలంటే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది కుల సమీకరణాలు.
ఇప్పుడు ఎక్కడికక్కడ కుల సంఘాల మీటింగ్స్ జోరుగా సాగుతున్నాయి.ప్రతీ కులం తమకు ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఇస్తారని రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నాయి.
టికెట్ ఇచ్చిన వారికే తమ మద్దతు ఉంటుంది తప్ప మిగతా పార్టీలకు తమ మద్దతు ఉండదు అని మీటింగ్స్ పెట్టి మరీ డిమాండ్స్ చేస్తున్నారు.రెండు సీట్లు కోరిన రెడ్లు.
ఈ విధంగానే విశాఖ జిల్లాలో రాజకీయ పార్టీలకు కొన్ని కుల సంఘాలు డిమాండ్స్ విధిస్తున్నాయి.విశాఖలో అత్యంత ప్రాధాన్యత కలిగిన సామాజిక వర్గం తమదని రెడ్లు అంటున్నారు.
దశాబ్దాలుగా విశాఖలో ఉంటూ రాజకీయంగా కూడా కీలకమైన పాత్ర వహించామని చెబుతున్నారు.జనాభాపరంగా చూసుకున్నా తమ ఓటింగ్ శాతం ఎక్కువని చెబుతున్నారు.
తమకు అన్ని రాజకీయ పార్టీలు ఈసారి టికెట్లు కేటాయించాల్సిందే అంటూ గట్టిగా కోరుతున్నారు.ప్రధాన పార్టీలైన టీడీపీ వైసీపీ, జనసేన తమ డిమాండ్లకు హామీ ఇస్తేనే ఓట్లు వేస్తామని కూడా అంటున్నాయి.
ఈ మేరకు తాజాగా మీటింగ్ పెట్టి మరీ రెడ్ల సంఘం నాయకులు రాజకీయ పార్టీలకు డెడ్ లైన్ విధిస్తున్నారు.
అలాగే మత్స్యకారుల సంఘం నేతలు కూడా ఈ విధంగానే సభలు పెట్టి తమ కులానికి సీట్లు ఇవ్వాలని లేని పక్షంలో ఆయా పార్టీలను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామంటూ ప్రకటిస్తున్నారు.అంతే కాదు తమకు ఎంపీ, ఎమ్మెల్యే పదవులు పొందేందుకు అన్ని హక్కులూ ఉన్నాయని గట్టిగా వాదిస్తున్నారు.విశాఖ దక్షిణం, భీమిలీల్లో మత్స్యకారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
అక్కడ సీట్లను వారు గట్టిగా కోరుతున్నారు.ఐతే టీడీపీ, వైసీపీ వారికి ఇంతవరకూ టికెట్ హామీ అయితే ఇవ్వలేదు.
అలాగే బ్రాహ్మణ సంఘం నాయకులు కూడా సీట్ల కోసం పోరు మొదలుపెట్టారు.ఉత్తరాంధ్రలోని ప్రతి జిల్లాలో మీటింగులు పెట్టి తమకు సీట్లు ఇవ్వాలని కోరుతున్నారు.
సీట్ల కేటాయింపు మరో రెండు రోజుల్లో పూర్తి చేసి ప్రచారంలో నిమగ్నం అవ్వాలని చూస్తున్న పార్టీలకు ఇప్పుడు కుల సంఘాల తలనొప్పులు తప్పడంలేదు.