గత కొంతకాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మానసిక పరిస్థితిపై అందరికీ అనుమానాలు కలుగుతున్న విషయం తెలిసిందే.మరీ ముఖ్యంగా కులాలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదం అవుతున్నాయి.
గతంలో ఒకసారి దళితులుగా ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అంటూ మాట్లాడి చంద్రబాబు దళితుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే.మరో సందర్భంలో తమ సమస్యను చెప్పుకోవడానికి సచివాలయానికి వచ్చిన నాయి బ్రాహ్మణులను ఉద్దేశించి మీ తోక కత్తిరిస్తా అంటూ మాట్లాడటం ఆ సామాజిక వర్గం ఆగ్రహానికి చంద్రబాబు కారణమయ్యారు.
ఇప్పుడు అధికారం కోల్పోయినా చంద్రబాబు మాత్రం అహంభావం ఎక్కడ తగ్గలేదనే విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి.ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు చంద్రబాబు పై విశాఖ జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బాబు రావు ఫిర్యాదు చేశారు.ప్రజలు చంద్రబాబుకు అధికారం దూరం చేసి బుద్ధి చెప్పినా ఇంకా తన వైఖరి మార్చుకోలేదని ఈ సందర్భంగా బాబు రావు మండిపడ్డారు.40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ప్రతిసారి దళితులను అవమానిస్తున్నారని, ఇప్పటికైనా ఆ పార్టీలో ఉన్న దళిత నాయకులు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు.ఏపీ రాజధాని సమగ్ర అభివృద్ధి విషయంలో జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించే సందర్భంలో ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు.
దీనిపైనే బాబురావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేయకపోతే దళితుల మనోభావాలు దెబ్బతింటాయని, తక్షణమే చంద్రబాబుపై కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు.దళితులు ఉద్యోగాలు చేయడం మొదటి నుంచి చంద్రబాబుకు ఇష్టం లేదని ఈ సందర్భంగా బాబు విమర్శించారు.బోస్టన్ నివేదికను వివరించిన ప్రణాళికా సంఘం కార్యదర్శి విజయ్ కుమార్ పై చంద్రబాబు చవకబారు విమర్శలు చేశారని బాబు రావు మండిపడ్డారు.
విజయ్ కుమార్ గారిని, విజయ్ కుమార్ గాడు అనడం ద్వారా చంద్రబాబు తన కుల దుహంకారాన్ని మరోసారి బయటపెట్టుకున్నారని బాబు రావు విమర్శించారు.