ఎక్కడ చూసినా, ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసులు ఇబ్బడిముబ్బడిగా నమోదవుతున్నాయి. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎవరిని వదిలిపెట్టకుండా , ఈ కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపుతోంది.
ఇప్పటికే ఎంతో మంది కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వైరస్ ప్రభావానికి గురయ్యారు.అలాగే కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సైతం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆయన ఫామ్ హౌస్ లో చికిత్స పొందుతూనే ఆ తరువాత యశోద ఆస్పత్రిలో చేరారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది.ఇక కెసిఆర్ తో సన్నిహితంగా మెలిగిన ఆయన బంధువు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కు సైతం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వార్తలు వచ్చాయి.
తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు.తాను ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో విశ్రాంతి తీసుకుంటున్నానని, తనకు కరోనా లక్షణాలు ఉన్నాయని, తనతో సన్నిహితంగా మెలిగేవారు అంతా తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కేటీఆర్ సూచించారు.అయితే కేటీఆర్ కు కరోనా అనే వార్త బయటకు రావడంతో అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది.
ముఖ్యంగా ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారంతా ఇప్పుడు పరీక్షలు చేయించుకునే పనిలో ఉన్నారట.ఇప్పటికే చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలకు ఈ వైరస్ సోకింది.
దీంతో కెసిఆర్, కేటీఆర్ తో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడంతో పాటు , హోమ్ అసోలేషన్ కు పరిమితమై పోయినట్టు సమాచారం.ఇప్పటికే తెలంగాణలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది.
వాక్సిన్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు.
ఆస్పత్రుల్లోనూ బెడ్ లు దొరకని పరిస్థితి ఏర్పడింది.ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో ఆరు వందల బెడ్ లు ఉండగా, అన్నీ ఫుల్ అయిపోయాయని , తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సైతం ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ విధించడంతో పాటు, పక్కాగా కోవిడ్ నిబంధనలను అమలు చేస్తున్నారు.
నాలుగు రోజుల క్రితం కరోనా ప్రభావానికి గురైన కేసిఆర్ తో ఎంపీ సంతోష్, మంత్రి కేటీఆర్ సన్నిహితంగా మెలగడంతో వారిద్దరికీ ఈ వైరస్ సోకినట్లుగా తెలుస్తోంది.