అమెరికా క్యాపిటల్ భవనంపై ట్రంప్ వర్గీయుల దాడిని తాను ముందే ఊహించానన్నారు కాబోయే అధ్యక్షుడు, డెమొక్రాట్ నేత జో బైడెన్.ట్రంప్ వ్యవహార శైలి, అధికార దాహం ఏదో ఒక రోజున ఈ పరిస్ధితికి దారి తీస్తుందని తాను గ్రహించానన్నారు.
అమెరికాలో గత నాలుగేళ్లుగా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, చట్టాలు ఇలా ప్రతి దానిపై ట్రంప్ ధిక్కరణకు పాల్పడుతున్నారని బైడెన్ ఆరోపించారు.అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన క్షణం నుంచి దేశంలోని ప్రతి వ్యవస్థపైనా ట్రంప్ దాడి ప్రారంభించారని.అది ఇప్పుడు పీక్స్కి వెళ్లిందని ఆయన ఎద్దేవా చేశారు.
దేశంలో కోవిడ్ విజృంభిస్తున్నా.
లక్షలాది మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పుతున్నా, పౌరునిగా బాధ్యత నిర్వహించాలని భావించి ఓటు హక్కును వినియోగించుకున్నారని బైడెన్ గుర్తుచేశారు.అలాంటి 16 కోట్ల మంది గళాన్ని ట్రంప్ మద్ధతుదారులు అణచివేసేందుకు యత్నించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ట్రంప్ చేసిన ప్రజాస్వామ్య ధిక్కార ఫలితమే తాజా హింసాత్మక ఘటనలకు కారణమని బైడెన్ స్పష్టం చేశారు.అసలు క్యాపిటల్ బిల్డింగ్ వద్ద నిరసనల్లో పాల్గొన్న వాళ్లు నిజంగా నిరసనకారులు కాదని, వాళ్లని అలా పిలవద్దని సూచించారు.
వారిని అల్లరి మూకలు, తిరుగుబాటుదారులు, తీవ్రవాదులుగా బైడెన్ అభివర్ణించారు.చివరికి న్యాయస్థానాల ద్వారా అధికారాన్ని అందుకుందామని భావించిన ట్రంప్కు అక్కడా నిరాశే ఎదురైందని బైడెన్ గుర్తుచేశారు.
దాదాపు 60 చోట్ల ట్రంప్ పిటిషన్లను కోర్టులు తిరస్కరించి.న్యాయవ్యవస్థ గొప్పతనాన్ని చాటుకున్నాయని ఆయన ప్రశంసించారు.
కాగా అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన డెమొక్రాట్ అభ్యర్ధి జో బైడెన్ గెలుపును అధికారికంగా ధ్రువీకరించే సమావేశాన్ని అడ్డుకునేందుకు ట్రంప్ మద్ధతుదారులు బుధవారం క్యాపిటల్ భవనాన్ని ముట్టడించిన సంగతి తెలిసిందే.బ్యారికేడ్లను దాటుకుని వెళ్లి పోలీసులతో ఘర్షణకు దిగారు.భవనంలోని కిటికీలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు.ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి వీరంగం సృష్టించారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ట్రంప్ మద్దతు దారులను అదుపులోకి చేసేందుకు భద్రతా సిబ్బంది తూటాలకు పనిచెప్పక తప్పలేదు.పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ మహిళతో పాటు ముగ్గురు మృతి చెందగా.
పలువురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
ఈ ఘటనపై ప్రపంచ దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
.