ఏపీలో పోలింగ్ ముగిసిపోయింది.ప్రధాన పార్టీలన్నీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ ముందుకు వెళ్లాయి.
ఆ తంతు కాస్తా ఏప్రియల్ 11 వ తేదీతో ముగిసిపోయింది.ఇప్పుడు మే 23 వ తేదీ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఈ లోపునే ఎన్నికల కమిషన్ ఎన్నికలల్లో పోటీ చేసిన అభ్యర్థులను భయపెట్టే పనిలో పడింది.ఈ ఎన్నికల్లో ప్రతి పార్టీ కోట్లాది రూపాయాలు కుమ్మరించి గెలుపు బాటలు వేసుకునేందుకు ప్రయత్నిచాయి.
అభ్యర్థులు చేస్తున్న ఖర్చుపై ఈసీ కూడా నిఘా ఏర్పాటు చేసుకుంది.ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి ఎంత ఖర్చుపెడుతున్నాడు ? దానికి సంబందించిన లెక్కలు సక్రమంగా అప్పగిస్తున్నాడా మొదలయిన అన్ని విషయాలను భేరీజు వేసుకుంటూ ఈసీ ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూనే ఉంది.
పోలింగ్ ముగిసిన తరువాత ఈసీ అభ్యర్థుల ఖర్చుపై ఆరా తీస్తుండడంతో చేసిన ఖర్చు గురించి లెక్కలు చెప్పలేక ఇప్పుడు అభ్యర్థులు తర్జనభర్జనపడుతున్నారు.రాష్ట్రంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేసినట్టు ప్రచారం జరిగింది.ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనే తపనతో ఒక్కొక్కరు కనీసం రూ.20 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు కూడా తేలింది.లోక్సభ అభ్యర్థులు అయితే, సుమారు రూ.100 కోట్ల వరకు ఖర్చు చేశారనే టాక్ కూడా నడిచింది.కాకపోతే ఏ అభ్యర్థి ఎంత ఖర్చు చేసాడు అనేది ఎన్నికల సంఘానికి ఖచ్చితంగా లెక్క చెప్పాల్సిందే.
ఈసీ నిబంధనల ప్రకారం ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల్లో రూ.28 లక్షలకు మించి ఖర్చు చేయడానికి రూల్స్ ఒప్పుకోవు.అలాగే ఎంపీ అభ్యర్థి అయితే, రూ.70లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చు.జనసేన, బీఎస్పీ, కామ్రేడ్లు అయితే, డబ్బుల విషయంలో అంత ఖర్చు చేసే పరిస్థితి లేదు.కానీ, టీడీపీ, వైసీపీ మాత్రం డబ్బులు విచ్చలవిడిగా ఖర్చుపెట్టాయి.ప్రచారం కోసం, కార్యకర్తలకు భోజనాలు, ఇతర సామగ్రి కోసం కోట్లకు కోట్ల రూపాయలను వెదజల్లాయి.ఓటర్లకు కూడా రూ.1000 నుంచి రూ.2000 ఇచ్చినట్టు ప్రచారం జరిగింది.ఇవన్నీ లెక్కగడితే ఎన్నికల సంఘం విధించిన పరిమితికి, వాస్తవ ఖర్చులకు పొంతన కుదరడంలేదు.
అందుకే ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగింది.
ఇటీవల కృష్ణా జిల్లాలోని ఓ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి నోటీసులు పంపిందట ఎన్నికల కమిషన్.ఓ ప్రచార కార్యక్రమం కోసం రూ.10లక్షలకు పైగా ఖర్చు చేశారని, అయితే, ఆ లెక్కలను ప్రతి వారం చూపాల్సిన లెక్కల్లో ఎందుకు చూపించలేదు అంటూ ప్రశించిందట.కృష్ణా జిల్లాలోనే సుమారు 20 మంది అభ్యర్థులకు ఇలా లెక్కలపై నోటీసులు వచ్చినట్టు సమాచారం.