కరోనా వైరస్ మనిషిలోని మానవత్వాన్ని తట్టిలేపింది.తోటి వ్యక్తి కష్టంలో ఉంటే చలించిపోయే మనుషులు సమాజంలో ఇంకా ఉన్నారని రుజువు చేసింది.
ఈ నేపథ్యంలో లాక్డౌన్ కాలంలో పేదల కడుపు నింపిన ఓ ప్రవాస భారతీయుడిని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రశంసించారు. పంజాబ్లోని మొహాలి జిల్లాకు చెందిన జగరాజ్ సిద్ధూ .సిక్కు మతంలోని ప్రధాన భావన అయిన తోటి వారికి సాయం చేయడమనే అంశానికి విలువనిచ్చారు.కరోనా సంక్షోభ సమయంలో కెనడాలోని బ్రాంప్టన్ నగరంలోని ప్రజలకు మూడు నెలల నుంచి ఉచిత ఆహారాన్ని అందిస్తూ వస్తున్నారు.
ఆయన నియమించిన వాలంటీర్లు ఆహారంతో పాటు శానిటైజర్, మాస్క్, గ్లౌజులు మొదలైన వాటిని ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు.జగరాజ్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దృష్టికి వెళ్లడంతో ఆయన అతనిని ప్రశంసించారు.
సిద్ధూ 20 ఏళ్ల క్రితం కెనడాకు వలస వచ్చారు.లాక్డౌన్ సమయంలో నిరుద్యోగులు, ఆకలితో ఉన్నవారిని చూసి.
తాను కెనడాకు వచ్చిన మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులు గుర్తొచ్చి ఎంతగానో చలించిపోయాడు.వీరిని ఎలాగైనా ఆదుకోవాలని భావించిన సిద్ధూ.
కొంతమంది స్నేహితులతో కలిసి ‘‘గురు కా లంగర్’’ ప్రారంభించి నిరుపేదలకు, విద్యార్ధులకు ఆహారాన్ని అందించడం ప్రారంభించాడు.ప్రతి నెలా తమ జీతంలో పదిశాతాన్ని దీని నిర్వహణ కోసం కేటాయిస్తున్నారు.
తొలుత జగ్రాజ్ బృందం ఆహారాన్ని నిల్వ చేస్తున్నారని అనుమానించిన స్థానికులు దీనిపై స్ధానిక అధికారులకు సమాచారం అందించారు.ఆ తర్వాత అదే స్థానికులు వీరి చేస్తున్న సేవా కార్యక్రమం గురించి తెలుసుకుని వాలంటీర్లుగా సేవలందిస్తున్నారు.
గురు కా లంగర్ గురించి జగ్రాజ్ మాట్లాడుతూ.లాక్డౌన్ సమయంలో తిండి లేక విద్యార్ధులు, పేదలు పడుతున్న బాధలు కళ్లారా చూసి, గురు నానక్ దేవ్ దాస్వంత్ బోధనను జ్ఞాపకం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించానని అన్నారు.మార్చి 20 నుంచి బ్రాంప్టన్లో పంజాబీ ఫుడ్ సేవను అందిస్తున్నానని సిద్ధూ చెప్పారు.తమ ప్రయత్నానికి వాలంటీర్ల సాయం కూడా తోడు కావడంతో ఆహారంతో పాటు కిరాణా వస్తువులు, కరోనాను ఎదుర్కొనేందుకు కావాల్సిన ఆరోగ్య పరికరాలను కూడా అందిస్తున్నట్లు జగ్రాజ్ వెల్లడించారు.
ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలపై బ్రాంప్టన్ నగర మేయర్ పాట్రిక్ బ్రౌన్, రీజనల్ కౌన్సిలర్ గుర్ప్రీత్ ధిల్లాన్తో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.క్లిష్ట సమయాల్లో పంజాబీలు ప్రజలను ఆదుకోవడానికి ముందుంటారని బ్రౌన్ ప్రశంసించారు.
కాగా కెనడాలో ఇప్పటి వరకు 92,410 మంది కోవిడ్ 19 బారినపడగా, 7,395 మంది ప్రాణాలు కోల్పోయారు.