వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం భారతీయులు ఎక్కువగా వెళ్లే దేశాల్లో కెనడా కూడా ఒకటి.మెరుగైన జీవనం, ఉపాధి అవకాశాలు, నాణ్యమైన విద్యను అందిస్తూ ఈ దేశం భారతీయులను ఆకట్టుకుంటోంది.
ఇక .మనదేశంలోని పంజాబ్ రాష్ట్రానికి కెనడాతో తొలి నుంచి అనుబంధం ఎక్కువ.దశాబ్ధాల అనుబంధంతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా కెనడాలోనే స్థిరపడటంతో పంజాబీ యువత చాలా మంది కెనడా వెళ్లేందుకు చిన్నప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటారు.అయితే ప్రస్తుత డిమాండ్కు తగ్గట్టుగా మనదేశంలో వున్న కెనడా దౌత్య కార్యాలయాల్లో వీసా ప్రాసెసింగ్ వేగంగా జరగడం లేదు.
దీంతో దరఖాస్తులు పెండింగ్లో పడిపోతున్నాయి.ఈ సమస్యను పరిష్కరించాలంటూ దరఖాస్తుదారులతో పాటు విదేశాంగ శాఖ కూడా పలుమార్లు కెనడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.
ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.ఆ దేశం రూపొందించిన కొత్త ఇండో పసిఫిక్ వ్యూహం భారతదేశాన్ని వాణిజ్యం, ఇమ్మిగ్రేషన్లకు సంబంధించి కీలక భాగస్వామిగా చూస్తోంది.
సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం దిశగా కీలక అడుగుగా ప్రాథమిక వాణిజ్య ఒప్పందానికి పిలుపునిచ్చింది.దీనిలో భాగంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలోని ఇస్లామాబాద్, మనీలా, న్యూఢిల్లీ, చండీగఢ్లలో వీసా ప్రాసెసింగ్ సామర్ధ్యాన్ని పెంచడానికి 74.6 మిలియ్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ట్రూడో ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన 26 పేజీల నివేదిక ప్రకారం.ఇండో పసిఫిక్ ప్రాంతం రాబోయే అర్ధ శతాబ్ధంలో కెనడా భవిష్యత్తును రూపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుందని అంచనా.ఈ ప్రాంతం 40 ఆర్ధిక వ్యవస్థలు, నాలుగు బిలియన్ల మంది ప్రజలు, 47.19 ట్రిలియన్ల ఆర్ధిక కార్యకలాపాలను కలిగి వుండటంతో పాటు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా నిలిచింది.