భారత సంతతి కెనడియన్ రక్షణ మంత్రి అనితా ఆనంద్ ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఇండో-కెనడియన్ల సహకారం, విజయాలను ప్రతిబింబిస్తూ ఆమె తన ప్రయాణాన్ని పంచుకున్నారు.
ఈ మేరకు అనిత ఓ వీడియోను విడుదల చేశారు.అందులో వేరు వేరు నేపథ్యాల నుంచి వచ్చిన తన తల్లిదండ్రులు కెనడాకు వచ్చి ఎలా స్థిరపడ్డారో అనితా ఆనంద్ గుర్తుచేసుకున్నారు.1960వ దశకంలో వారు కెనడాకు వలస వచ్చారని ఆమె తెలిపారు.
అనితా ఆనంద్ తల్లి పంజాబ్కు చెందిన డాక్టర్ సరోజ్ దౌలత్ రామ్, తండ్రి తమిళనాడుకు చెందిన డాక్టర్ సుందర్ వివేక్ ఆనంద్.
వీరికి ఐర్లాండ్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇంగ్లాండ్లో పెళ్లి చేసుకున్నారు.భారత్, నైజీరియాలలో నివసించిన వీరు 1965 నుంచి కెనడాలో స్థిరపడ్డారు.ఇప్పటికీ వీరి బంధువులు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులలో ఉన్నారు.అనిత తాతగారు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.
2019 అక్టోబర్లో అనిత కెనడా పార్లమెంట్కు ఎన్నికయ్యారు.హౌస్ ఆఫ్ కామన్స్కు ఎన్నికై, ప్రధాని జస్టిన్ టూడ్రో కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్న మొదటి హిందూ మహిళగా రికార్డుల్లోకెక్కారు.
ప్రస్తుతం నలుగురు పిల్లలకు తల్లిగా ఉన్న అనితా ఆనంద్ ఓక్విల్లే ప్రాంతంలోని ప్రజలకు అత్యంత సన్నిహితంగా మెలుగుతారు.రాజకీయాల్లోకి రాకముందు టొరంటో విశ్వవిద్యాలయంలో లా ప్రొఫెసర్గా ఆమె సేవలందించారు.
తాను తమిళ, పంజాబీ వంశానికి చెందిన వ్యక్తిని అయినందుకు గర్విస్తున్నానని అనితా ఆనంద్ అన్నారు.ఈ రెండు సంస్కృతులను ప్రేమిస్తూ పెరిగానని ఆమె పేర్కొన్నారు.
వాంకోవర్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ప్రకారం.కెనడా ప్రపంచంలో భారతీయులు ఎక్కువగా స్థిరపడిన దేశాలలో ఒకటి.ఇక్కడ 1.6 మిలియన్ల మంది భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారు.ఇది ఆ దేశ జనాభాలో 3 శాతం కంటే ఎక్కువ.
గ్రేటర్ టొరంటో, గ్రేటర్ వాంకోవర్, మాంట్రియల్ (క్యూబెక్), కాల్గరీ (అల్బెర్టా), ఒట్టావా (ఒంటారియో), విన్నిపెగ్ (మానిటోబా)లలో భారతీయ కమ్యూనిటీ పెద్ద సంఖ్యలో స్థిరపడింది.
జాతిపిత మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి 1915 జనవరి 9 తిరిగి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం 2003 నుండి ప్రతిఏటా ప్రవాసి భారతీయ దివస్ను జరుపుతోంది.
ప్రవాస భారతీయులతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా భారతదేశ అభివృద్ధికి ఎన్ఆర్ఐలు చేసిన కృషికి గుర్తుగా వేడుకలు నిర్వహిస్తున్నారు.