హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా ‘కోవాగ్జిన్’కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసిన సంగతి తెలిసిందే.కోవాగ్జిన్ను ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్(ఈయూఎల్)లో చేర్చినట్లు డబ్ల్యూహెచ్ఓ నవంబర్ 4న ప్రకటించింది.
కోవాగ్జిన్కు ఈయూఎల్ హోదా కల్పించవచ్చంటూ డబ్ల్యూహెచ్ఓకు చెందిన స్వతంత్ర సాంకేతిక సలహా బృందం(టీఏజీ) ప్రతిపాదించడంతో టీకాకు మార్గం సుగమమైంది.
గతంలో కోవాగ్జిన్ అంతర్జాతీయంగా అనుమతి పొందిన వ్యాక్సిన్ల జాబితాలో లేకపోవడంతో విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఇబ్బంది ఏర్పడింది.
ఈ నేపథ్యంలో కోవాగ్జిన్ అనుమతి విషయంలో ఇండియా.ప్రపంచ ఆరోగ్యసంస్థపై ఒత్తిడి తెచ్చింది.
ఈ ప్రయత్నాలు ఫలించి కోవాగ్జిన్ ఈయూఎల్లో చోటు దక్కించుకుంది.దీని వల్ల కోవాగ్జిన్ వేయించుకున్న వారు వివిధ దేశాలకు వెళ్లినప్పుడు ఎలాంటి క్వారంటైన్లో వుండనక్కర్లేదు.
డబ్ల్యూహెచ్ఓ నుంచి ప్రకటన వెలువడిన తక్షణం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు కోవాగ్జిన్ వేయించుకున్న వారిని తమ దేశంలోకి అనుమతిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ లిస్ట్లోకి కెనడా చేరింది.
సినోఫార్మ్, సినోవాక్, కోవాగ్జిన్ టీకాలను రెండు డోసులు తీసుకున్న ప్రయాణీకులు నవంబర్ 30 నుంచి కెనడాలోకి ప్రవేశించవచ్చని ఆ దేశ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.ఇప్పటికే ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలు తీసుకున్న అంతర్జాతీయ ప్రయాణీకులకు కెనడా అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.నవంబర్ 30 నుంచి కెనడాకు వచ్చే 72 గంటల ముందు కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ను సమర్పించాల్సిన అవసరం లేదని ఆ దేశ ప్రభుత్వం తెలియజేసింది.కాగా.కెనడా ప్రభుత్వ లెక్కల ప్రకారం.నేటి వరకు ఆ దేశంలో 17,62,434 మంది కోవిడ్ వైరస్ బారినపడగా.29,481 మంది ప్రాణాలు కోల్పోయారు.