సిక్కులు తమ మత విశ్వాసాలను తూచా తప్పకుండా పాటిస్తారు.ప్రాణాలు పోయినా సరే వాటిని విడిచిపెట్టరు.
తలపాగా, గడ్డం, చిన్న కత్తి అన్నవి సిక్కు మతాన్ని అనుసరించే మగవాళ్లు ఖచ్చితంగా ఫాలో అవుతారు.ఏ దేశమేగినా ఎందుకాలిడినా సిక్కు మతస్తులు తమ సంస్కృతీ సంప్రదాయాలను ఏమాత్రం మరచిపోరు.
విడిచిపెట్టరు.విదేశాలలో స్థిరపడి ఉన్నతస్థాయిలోకి చేరుకున్నా సరే వారి మూలాలను ఏమాత్రం వదలరు.
మానవసేవే మాధవ సేవ అని నమ్ముతారు .ప్రపంచంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా సహాయ చర్యల్లో పాల్గొనడంతో పాటు చేతనైనంత సాయం చేస్తుంటారు.కరోనా సమయంలో ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వారికి కడుపు నింపారు సిక్కులు.ఇక ఆస్ట్రేలియాలో కార్చిచ్చు సమయంలో నిరాశ్రయులైన వేలాది మందికి కూడా భోజనం పెట్టారు.
ఇకపోతే.సిక్కులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో కెనడా ఒకటి.ఇక్కడి అన్ని ప్రావిన్సులలోనూ సిక్కుల ప్రాబల్యం అధికం.ఇక్కడి రాజకీయాలను, వ్యవస్థలను ప్రభావితం చేయగల స్థాయిలో వారున్నారు.ప్రభుత్వంలో ఎవరున్నా సరే వీరికి ప్రాధాన్యతనిస్తారు.అటు సిక్కులు కూడా తమకు ఆశ్రయం కల్పించిన దేశం పట్ల కృతజ్ఞత చూపుతున్నారు.
ఆపదలను ఎదుర్కోవడానికి సదా సిద్ధంగా వుంటారు .ఇందుకోసం విరాళాలు సేకరించి ఫుడ్ బ్యాంక్ను సైతం నెలకొల్పారు.
ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బుధవారం సర్రేలోని గురునానక్ ఫుడ్ బ్యాంక్ను సందర్శించారు.అంతేకాకుండా కొన్ని పెట్టెలను ప్యాక్ చేసి ఫుడ్ బ్యాంక్కు సంబంధించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రతి నెలా వందలాది మందిని నిస్వార్థంగా ఆదుకుంటున్న ఫుడ్ బ్యాంక్ నిర్వాహకులకు , వాలంటీర్లకు ట్రూడో కృతజ్ఞతలు తెలిపారు.ఆపన్నులకు ఆహారం, అంతర్జాతీయ విద్యార్ధులకు సామాగ్రి, ఒంటరి తల్లులకు డైపర్లు, ఇతర వస్తువులను అందించేందుకు వారు చేస్తున్న కృషిని ప్రధాని అభినందించారు.
ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఫోటోలను షేర్ చేశారు.