ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినవారిని తనిఖీ చేయడానికి లూధియానా పోలీసులు ఒక ప్రచారాన్ని ప్రారంభించారు.కెనడా, ఆస్ట్రేలియాల్లో ధీర్ఘకాలిక వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారి ట్రాఫిక్ నేరాల వివరాలను అడుగుతున్నాయని కాబట్టి ప్రజలు సహకరించాలని లూధియానా పోలీస్ కమీషనర్ రాకేశ్ అగర్వాల్ తెలిపారు.
వీసా దరఖాస్తుదారుల ట్రాఫిక్ ఉల్లంఘన వివరాలను కోరుతూ ఆయా రాయబార కార్యాలయాల నుంచి గతేడాది కాలంలో ప్రతినెలా పోలీసులకు కాల్స్ వస్తున్నాయన్నారు.డ్రైవర్లు చేసిన నేరాల వివరాలు తమ వద్ద డిజిటల్ ఫార్మాట్లో ఉన్నాయని కాబట్టి తాము సంబంధిత అధికారులతో ఈ సమాచారాన్ని పంచుకోవచ్చునని ఆయన తెలిపారు.
లూధియానా నుంచి చాలా మంది ప్రజలు ఈ రెండు దేశాల పౌరసత్వం, దీర్ఘకాలిక వీసా కోసం దరఖాస్తు చేస్తున్నందున తాము ఈ విధానాన్ని ట్రాఫిక్ నియమాలను అరికట్టడానికి ఒక సాధనంగా ఉపయోగిస్తున్నామన్నారు.
మెర్సిడెస్ కార్ల నగరంగా పిలవబడే లూధియానాకు ప్రమాదాల విషయంలో మాత్రం చెత్త రికార్డు ఉంది.2017లో వివిధ ప్రమాదాల్లో 281 మంది మరణించగా… 2018లో 477 ప్రమాదాలకు గాను 328 మంది ప్రాణాలు కోల్పోయారు.నగరం గుండా వెళ్లే జాతీయ రహదారుల కారణంగా ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని రాకేశ్ తెలిపారు.
అందువల్ల ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఇతర నగరాలు సైతం ఈ విధానాన్ని అనుసరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయని ఆయన వెల్లడించారు.
ఆస్ట్రేలియా, కెనడా దేశాలలో దీర్ఘకాలిక వీసా, పౌరసత్వం కోసం పంజాబ్ నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటారు.అందువల్ల ఇలాంటి ప్రచారం సానుకూల ప్రభావాన్ని చూపుతుందని రాష్ట్ర ప్రభుత్వ ట్రాఫిక్ సలహాదారు నవదీప్ ఆసిజా ఆకాంక్షించారు.