నిపుణులు హెచ్చరించినట్లుగానే ఒమిక్రాన్ వేరియంట్ దడ పుట్టిస్తోంది.రోజుల వ్యవధిలో 30కి పైగా దేశాలు దీని బారినపడ్డాయి.
అనుమానిత కేసులు సైతం భారీగా వున్నాయి.జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్లలో వున్న నమూనాలకు సంబంధించి ఫలితాలు వస్తే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారీగానే వుండే అవకాశం వుంది.
దేశాలకు దేశాలే సరిహద్దులను మూసివేస్తున్నా.అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించినా ఈ వేరియంట్ ఎప్పుడు.
ఎటు నుంచి వస్తుందో అర్ధం కాక ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి.మనదేశంలోనూ కర్ణాటకలో రెండు కేసులు వెలుగు చూశాయి.
అయితే వీరిద్దరిలో ఒకరితో సన్నిహితంగా వున్న కొందరికి పాజిటివ్గా తేలింది.దీంతో వీరి నమూనాలను ల్యాబ్కు పంపారు.
అంతేకాదు భారత్లో అనుమానిత కేసులు కూడా పెరుగుతున్నాయి.ఢిల్లీ, ముంబైలలో దాదాపు 40 వరకు అనుమానితులు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.
ఇకపోతే కెనడాలోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి.ఇక్కడ గతనెల 28న తొలి కేసు నమోదయింది.
ఆఫ్రికా దేశమైన నైజీరియా నుంచి ఒంటారియకు వచ్చిన ఇద్దరికీ ఈ వైరస్ సోకింది.ఆ తర్వాత కెనడాలో వేరియంట్ చాప కింద నీరులా విస్తరించగా.
ఇప్పుడు కేసుల సంఖ్య 15కి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు.రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
ఈనేపథ్యంలో దేశంలో వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్న 50 ఏండ్లు పైబడినవారికి బూస్టర్ డోస్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఈ మేరకు నేషనల్ అడ్వైజరీ బోర్డు ప్రభుత్వానికి సూచించింది.
మరోవైపు ఒమిక్రాన్ బారినపడిన వారిలో 12 ఏళ్ల చిన్నారి కూడా ఉందని, ఆమె ఈ మధ్యే దక్షిణాఫ్రికా నుంచి వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.టొరంటోలో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా.అందులో ఇద్దరు నైజీరియా నుంచి, మరొకరు స్విట్జర్లాండ్ నుంచి వచ్చారని పేర్కొన్నారు.ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆఫ్రికాతో సహా అన్ని దేశాల అంతర్జాతీయ విమాన సర్వీసులపై కెనడా ప్రభుత్వం నిషేధం విధించింది.
అటు దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.విమానాశ్రాయాల్లో స్క్రీనింగ్, పరీక్షలను పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు.