అమెరికాలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది.రెండు రోజులపాటు అక్కడ కాస్త శాంతించినట్లు కనిపించినా గురువారం మళ్లీ విజృంభించింది.
తాజాగా 24 గంటల వ్యవధిలో 2,502 మంది కోవిడ్ 19 బారినపడి ప్రాణాలు కోల్పోయారు.సరిగ్గా ఇదే సమయంలో అమెరికాలోని పలు జైళ్లలో సుమారు 2 వేల మంది ఖైదీలకు కరోనా వైరస్ పాజిటివ్గా తేలిందని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ వెల్లడించింది.
వైద్య పరీక్షలు నిర్వహించిన 2,700 మందిలో 2,000 మంది వైరస్ బారినపడ్డారని తెలిపింది.
ఇప్పటి వరకు అమెరికాలో కోవిడ్ 19తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60 వేలకు చేరుకుంది.
దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ ప్రజలు వాటిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.ఈ నేపథ్యంలో ఇళ్లలోనే ఉండాలన్న ఆంక్షలను ధిక్కరిస్తూ వేల మంది బీచ్లకు పోటెత్తుతున్నారు.
అసలే దేశంలో కోవిడ్ విలయతాండవం చేస్తున్న సమయంలో బీచ్లలో జనం తాకిడితో ప్రభుత్వం ఉలిక్కిపడింది.
ప్రజారోగ్య మార్గదర్శకాలను ధిక్కరించడంపై కాలిఫోర్నియా గావర్నర్ గావిన్ న్యూసోమ్ సీరియస్ అయ్యారు.
రాష్ట్ర దక్షిణ భాగంలోని ఆరెంజ్ కౌంటీలోని బీచ్లు, ఉద్యానవనాలు మూసివేయాలని ఆయన గురువారం ఆదేశాలు జారీ చేశారు.బీచ్, పార్క్ల కారణంగా కరోనా వైరస్ మరింత మందికి సోకేందుకు కారణం అవుతుందని కాలిఫోర్నియా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.