అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ప్రపంచంలోనే అత్యధిక కేసులు, మరణాలతో అగ్రరాజ్యం వణికిపోతోంది.
ఫైజర్, మోడెర్నా టీకాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ అవి దేశమంతా పంపిణీ జరగడానికి సమయం పట్టేలా వుంది.కానీ ఇలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.
ఇప్పటికే సెకండ్ వేవ్లో పీక్స్ చూస్తోన్న అమెరికాలో కోవిడ్ మరణాలు, కేసులు రాకెట్ వేగంతో నమోదవుతున్నాయి.ఈ క్రమంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య గురువారం నాటికి 25 వేల మార్కును దాటింది.38 వేలతో న్యూయార్క్ అగ్రస్థానంలో ఉండగా, 27 వేలతో టెక్సాస్ ద్వితీయ స్థానంలో వుంది.
థ్యాంక్స్ గివింగ్, క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకల కారణంగా రాబోయే రోజుల్లో కోవిడ్ మరింత విజృంభించే అవకాశం వుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సెకండ్ వేవ్ దశలో ఇక్కడి బాధితుల్లో వైరస్ మ్యూటేషన్ జరిగినట్లుగా తెలుస్తోంది.ఈ కొత్త వైరస్కు పాత దాని కంటే వేగంగా వ్యాపించే లక్షణం ఉండటం అధికారుల్లో కంగారు పుట్టిస్తోంది.
ఇక కాలిఫోర్నియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల్లో 40 శాతం ఒక్క లాస్ ఏంజిల్స్లోనివే.ఇక్కడ ప్రతిగంటకు సగటున ఆరుగురు చనిపోతున్నారు.ఒక టైంలో అయితే ఒకే రోజు 290 మంది మరణించారు.అంటే సగటున ప్రతి ఐదు నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
కేసుల సంఖ్య పెరిగిపోవడంతో ఆసుపత్రులపై, వైద్యులపై భారం పెరిగిపోతోంది.దక్షిణ కాలిఫోర్నియాలోని ఆసుపత్రుల్లో కోవిడ్ రోగులకు ఐసీయూలు దొరకడం లేదు.ఏం చేయాలో పాలుపోని అధికారులు.మధ్యేమార్గంగా రోగుల్ని వీల్చైర్, హాల్ ఇలా ఎక్కడ వీలైతే అక్కడ వైద్యం చేస్తున్నారు.ఎక్కువమందిలో శ్వాసకోశ ఇబ్బందులు ఉండటంతో ఆక్సిజన్ కొరత వేధిస్తోంది.దీనికి తోడు కోలుకున్న వారు తమ ఇంటికి ఆక్సిజన్ సిలిండర్లు కావాలని పట్టుబడుతున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి కోవిడ్ నిర్థారణ అయిన రోగుల్ని అంబులెన్స్ల్లో ఆసుపత్రులకు చేర్చుతూ క్యూకడుతున్నాయి.రోగులను లోపలికి చేర్చేందుకు సుమారు ఎనిమిది గంటల సమయం పడుతుంటే కాలిఫోర్నియాలో పరిస్ధితి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు.
గత్యంతరం లేక కొందరికైతే అంబులెన్స్ల్లోనే ట్రీట్మెంట్ చేస్తున్నారు.