జాతీయ పౌర పట్టిక (ఎన్ ఆర్ సీ) పై బీజేపీ మిత్ర పక్ష జేడీయు అధినేత,బీహార్ సీఎం నితీష్ కుమార్ మొట్ట మొదటి సారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.సోమవారం రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో మాట్లాడిన ఆయన బీహార్ లో ఎన్ ఆర్ సి అమలు చేసేది లేదని దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందంటూ తాజాగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
పార్లమెంటులో తమ పార్టీ ఈ చట్టంపై ప్రభుత్వానికి మద్దతు తెలిపినప్పటికీ కూడా నితీష్ ఇలాంటి అభ్యంతరం వ్యక్తం చేయడం విశేషం.అలాగే ఎన్నార్సీని బీహార్లో అమలు చేసే ప్రసక్తి గానీ, ఆ అవసరం గానీ లేదని కూడా ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
నిండు సభలో నితీష్ కుమార్ అధికారికంగా ఈ స్టేట్ మెంట్ చేయడం ఆశ్చర్యకరంగా మారింది.‘ సవరించిన పౌరసత్వ చట్టంపై మొదట చర్చ జరగాలి.
ప్రజలు కోరితే అప్పుడు ఈ సభలో దీనిపై చర్చ జరుగుతుంది.ఇక ఎన్నార్సీ సంబంధించి దీన్ని రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదు.
ఆ అవసరం కూడా లేదు ‘ అని ఆయన అన్నారు.పౌరసత్వ సవరణ చట్టం-2019పై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు.
సీఏఏపై అన్ని పార్టీలు చర్చించాలని, వారు అంగీకరిస్తే, పార్లమెంటు కూడా ఈ వివిదాస్పద చట్టంపై సంప్రదింపులు జరపాలని అన్నారు.ఎన్ఆర్సీ అమలు విషయంలో అడ్డం తిరిగిన ఎన్డీయేకు చెందిన తొలి ముఖ్యమంత్రి నితీష్ కావడం విశేషం.
జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ సైతం ఇదే అంశం పై స్పందించిన విషయం తెలిసిందే.ఇప్పుడు తాజాగా నితీష్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం తో ఇంతవరకూ పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలు మాత్రమే వ్యతిరేకిస్తూ వస్తున్నసీఏఏ, ఎన్ఆర్సీ అమలును ఇప్పుడు ఆ లిస్ట్ లో బీహార్ కూడా వచ్చి చేరినట్లు అయ్యింది.