పంజాబ్లో విషాదం చోటు చేసుకుంది.లూధియానాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎన్ఆర్ఐ విద్యార్ధిని దుర్మరణం పాలైంది.
మృతురాలిని 23 ఏళ్ల మీనా శర్మగా గుర్తించారు.
ఆమె కుటుంబం కెనడాలోని సర్రేలో స్ధిరపడింది.
ఆమె తండ్రి అరుణ్ శర్మ పశువైద్యుడు.మీనాకు తల్లీ ఒక అక్క, తమ్ముడు ఉన్నారు.
మీనా గురు అంగద్ దేవ్ యానీమల్ సైన్స్ యూనివర్సిటీలో వెటర్నరీ సైన్స్ రెండో ఏడాది చదువుతున్నారు.ఆమె సిరోవాన్ కాలువ పక్కన ఫిరోజ్పూర్ రోడ్ వైపు ఉన్న యూనివర్సిటీ హాస్టల్లో నివసిస్తున్నారు.
గురువారం ఉదయం 9 గంటలకు ఆమె తన హాస్టల్ నుంచి స్కూటీపై వంతెనకు అవతలివైపు వున్న కాలేజీకి బయల్దేరింది.ఈ నేపథ్యంలో ఫిరోజ్పూర్ రోడ్లోని వర్కా మిల్క్ ప్లాంట్ సమీపంలో ముల్లన్పూర్ వైపు నుంచి వేగంగా వస్తున్న బస్సు వెనుక నుంచి ఆమె స్కూటీని ఢీకొట్టింది.ఈ ఘటనలో మీనా ఎగిరి రోడ్డుపై పడింది.తీవ్ర గాయాలపాలై రక్తపు మడుగులో పడిన ఆమెను స్థానికులు వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
మీనాను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు.
మీనా మరణవార్తను ఛండీగఢ్లోని ఆమె అత్త మమతా శర్మ కెనడాలోని తల్లీదండ్రులకు తెలియజేశారు.వారు రెండు రోజుల్లో లూధియానాకు చేరుకోనున్నారు.మీనా మావయ్య వరీందర్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన బస్సును స్వాధీనం చేసుకోని, నిందితుల కోసం గాలిస్తున్నారు.