స్టైలిష్ స్టార్ బన్నీ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా అల వైకుంఠపురములో సినిమా తరువాత బన్నీ హీరోగా రంగస్థలం సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమా తరువాత బన్నీ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని సమాచారం
మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ లతో ఇప్పటికే సినిమాలు తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్లు సాధించిన కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడగా ఈ ఏడాది మే నెలలో ఆచార్య సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
ఆచార్య సినిమా విడుదలైన తరువాత బన్నీ కొరటాల శివ సినిమా పట్టాలెక్కనుంది.
ఈ సినిమాకు ఇప్పటికే హీరోయిన్ కూడా ఫైనలైజ్ అయినట్టు తెలుస్తోంది.బాలీవుడ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్ ఈ సినిమాలో బన్నీకి జోడీగా నటించనున్నారని సమాచారం.అడివి శేష్ హీరోగా నటిస్తున్న మేజర్ సినిమాతో సయీ మంజ్రేకర్ టాలీవుడ్ కు పరిచయం కానున్నారు.
భరత్ అనే నేను సినిమాకు బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేసుకున్న కొరటాల శివ ఈ సినిమాకు కూడా బాలీవుడ్ హీరోయిన్ నే ఎంపిక చేసినట్లు వార్తలు వస్తుండటం గమనార్హం.
అయితే సయీ మంజ్రేకర్ నే ఈ సినిమాలో హీరోయిన్ గా ఫైనలైజ్ చేసినట్లు చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ప్రతి స్టార్ హీరోకు బ్లాక్ బస్టర్ హిట్టిచ్చిన కొరటాల శివ బన్నీతో ఎలాంటి సినిమా తెరకెక్కిస్తారో చూడాల్సి ఉంది.ఈ ఏడాది సెకండాఫ్ లో బన్నీ కొరటాల శివ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
.