సాధారణంగా స్కూల్ ఫీజు కట్టడానికి చాలామంది తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతుంటారు.అయితే ఇక్కడొక స్కూల్ మాత్రం అలా చేయలేదు.
ఫీజుకు బదులుగా ప్లాస్టిక్ ఇవ్వాలని చెప్పింది.దీంతో స్కూల్ కు పిల్లలు వెళ్లేటప్పుడు ఓ చేత్తో సేకరించిన ప్లాస్టిక్ కవర్, మరో చేత్తో పుస్తకాలను పట్టుకుని ఎంచెక్కా వెళ్తున్నారు.
న్యూయార్క్ లో ఉండే మజిన్ ముఖ్తార్ ఓ అద్బుతమైన స్కూల్ ప్రాజెక్ట్ తో 2013లో ఇండియాలో కాలు మోపారు.ఆ టైంలోనే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ లో మాస్టర్స్ చేస్తున్న పర్మిత శర్మను కలిసి చేయి కలిపాడు.
అలా పర్మిత, ముఖ్తార్ తో ఇద్దరూ కలసి 2016వ సంవత్సరంలో అక్షర్ స్కూల్ ను నిర్మించారు.స్కూల్ కూడా మంచి ఆలోచనతో ముందుకు అడుగులు వేస్తుండగా ఓ రోజు పాఠశాలలో ఉన్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను పాఠశాల ఆవరణలోనే తగులబెట్టడంతో విద్యార్థులు పొగ పీల్చుకోలేక ఇబ్బందులు పడ్డారు.ప్లాస్టిక్ కాల్చడం అనేది విద్యార్థులకు ఇబ్బందికర విషయమని తెలుసుకున్నారు.
పర్యావరణానికి కూడా అది చాలా ప్రమాదమని అనుకున్నారు.దీంతో పర్మిత, ముఖ్తార్ లు ఇద్దరూ కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు.ఫీజుకు బదులుగా ప్లాస్టిక్ ను తీసుకోవాలని ఇద్దరూ అనుకున్నారు.
వెంటనే వాళ్లు తమ ఆలోచనకు బాటలు వేశారు.ఇద్దరూ కలిసి అక్షర్ పాఠశాలకు వచ్చేటటువంటి విద్యార్థులకు ప్లాస్టిక్ వ్యర్థాలను ఇవ్వాలంటూ తెలిపారు.
అలా ప్లాస్టిక్ ను తెచ్చి పాఠశాలకు ఇచ్చిన వారికి చదువు ఉచితం అని చెప్పారు.ఈ ఆఫర్ తో పాఠశాలలో 20 మందిగా ఉన్నటువంటి విద్యార్థులు ఒక్కసారిగా వంద మందికిపైనే అయిపోయారు.
విద్యార్థులంతా తమ పరిసరాల్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొచ్చి పాఠశాలకు ఇస్తారు.ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ తో గోడలు నిర్మించడం, ఇతర పాఠశాల భాగాలను రెడీ చేస్తారు.
విద్యార్థులకు పాఠశాలలో ఆటలు పాటలతో పాటుగా సోలార్ ప్యానెలింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, కాస్మెటాలజీ, కార్పెంటరీ, గార్డెనింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి వాటిని కూడా నేర్పిస్తుంటారు.