మొదటి నుంచి గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ అలజడి చోటు చేసుకుంది.టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ వైసిపికి అనుబంధంగా కొనసాగుతున్నారు.
సందర్భం వచ్చినప్పుడల్లా టిడిపి పైన, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పైన విమర్శలు చేస్తూ వస్తున్నారు.ఈ క్రమంలోనే చంద్రబాబుపై వంశి చేసిన విమర్శలపై టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టాయి.
క్రమ క్రమంగా ఈ వివాదం తీవ్ర రూపం దాల్చి చివరకు గన్నవరం టిడిపి కార్యాలయం పైన దాడి వరకు వెళ్ళింది.ఎమ్మెల్యే వంశీ అనుచరులే టిడిపి కార్యాలయం పై దాడి చేయించారని వంశీ అండ చూసుకునే పార్టీ కార్యాలయం తో పాటు, అక్కడ నిలిపి ఉంచినవాహనాలను తగులు పెట్టారని టిడిపి విమర్శలు చేసింది.
ఈ వ్యవహారంపై టిడిపి కీలక నేత బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు.వల్లభనేని వంశీకి సవాల్ విసిరారు .దమ్ముంటే ఈ రోజు 12 గంటలకు ఎన్టీఆర్ సర్కిల్ కు రావాలని, మీరో మేమో తేల్చుకుందామని , ఎవరూ లేనప్పుడు టిడిపి ఆఫీస్ పై దాడి చేయడం కాదని వెంకన్న సవాల్ చేశారు.
అయితే వెంకన్న సవాల్ ను వంశీ స్వీకరిస్తారా లేదా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.గత రెండు మూడు రోజులుగా ఇదే తరహా వాతావరణం గన్నవరం నియోజకవర్గంలో నెలకొంది .వంశీ చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు టిడిపి నేతలు గన్నవరం పోలీస్ స్టేషన్ కు వెళ్ళగానే .వంశీ అనుచరులు టిడిపి ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారని, పెట్రోల్ డబ్బాలు, క్రికెట్ బ్యాట్లతో విరుచుకుపడి ఆఫీసులో అద్దాలు , ఫర్నిచర్ ధ్వంసం చేశారని టిడిపి విమర్శలు చేస్తోంది.గత కొద్ది రోజులుగా వంశీ వర్గీయులు టిడిపి నేతల మధ్య పరస్పరం విమర్శలు , ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.
తాజాగా జరిగిన అల్లరిలో టిడిపి కీలక నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కారును ఆందోళనకారులు ధ్వంసం చేశారు.
అలాగే వంశీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన దొంతు చిన్నా కారుకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.ఈ వ్యవహారంలోనే కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ వ్యవహారం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలకు కారణం అవుతోంది.
టిడిపి టికెట్ పై గెలిచిన వంశీ ఇప్పుడు అధికార పార్టీ అండ చూసుకుని ఈ విధంగా టిడిపి శ్రేణులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని టిడిపి ఆరోపిస్తోంది.ఇక టిడిపి నేత బుద్ధ వెంకన్న విసిరిన సవాలను వంశీ స్వీకరిస్తారా ? స్వీకరిస్తే అక్కడ తలెత్తే పరిణామాలు ఏమిటి అనేది ఆసక్తికరంగా మారింది.ఈ పరిణామాల మధ్య పోలీసులు ముందస్తుగా భద్రత ఏర్పాట్లు ఆ ప్రాంతంలో చేస్తున్నారు.గన్నవరంలో చెలరేగిన ఈ వివాదం ఇప్పుడు విజయవాడలోనూ మంటలు పుట్టించబోతోంది.