దుర్గామాతకు బాలుడిని బలి ఇస్తే తమ కోరికలు నెరవేరతాయనే నమ్మకంతో వారిని నమ్మి వెళ్లిన బాలుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, పూజలు చేసి బలి ఇచ్చారు ఇద్దరు కిరాతకులు.హత్య తర్వాత శరీరాన్ని నది ఒడ్డున్న ఇసుకలో కప్పి పెట్టారు.
సంచలనం రేపిన ఈ హత్య ఒడిశాలోని బొలంగిర్ జిల్లా సుంధిముండ గ్రామంలో జరిగింది.
ఆ గ్రామానికి చెందిన ఘనశ్యామ్ రానా (9) అక్టోబరు 13 నుంచి కనిపించడం లేదు.దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా బాలుడి గురించి గాలించిన పోలీసులకు ఉందేయి నదీ తీరంలో తల లేని శరీరం లభించింది.
దానికి కొద్ది దూరంలోనే తల కూడా కనిపించింది.అది ఘనశ్యామ్ శరీరరమేనని కుటుంబికులు గుర్తించారు.
గ్రామంలో తమకు ఎవరూ శత్రువులు లేరని బాలుడి కుటుంబ సభ్యులు చెప్పడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు జరిపారు.బాలుడి శరీరంపై ఉన్న వేలి ముద్రల ద్వారా నిందితులను కనిపెట్టే ప్రయత్నం చేశారు.
ఆ వేలి ముద్రలు మృతుడికి అన్న వరసైన శోభాబన్ రానా, బాబాయ్ కుంజన్ రానాల వేలి ముద్రలతో సరిపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు.దీంతో ఘనశ్యామ్ను హత్య చేసింది తామేనని నేరం ఒప్పుకున్నారు.