బ్రిటన్ ప్రధాని ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రిషి సునాక్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే.తొలుత ఒక్కో అభ్యర్ధిని దాటుకుంటూ టాప్లో కొనసాగిన ఆయనకు ప్రస్తుతం లిజ్ ట్రస్ గట్టి పోటీనిస్తున్నారు.
డిబేట్లు, సర్వేల్లో సునాక్ తేలిపోతున్నారు.ఇటీవల కన్జర్వేటివ్ పార్టీ వెబ్సైట్ నిర్వహించిన సర్వేలో లిజ్ ట్రస్ ముందంజలో నిలిచిన సంగతి తెలిసిందే.సదరు పోల్లో 961 మంది కన్జర్వేటివ్ సభ్యులు పాల్గొన్నారు.ఇందులో లిజ్ ట్రస్కు 60 శాతం మంది జైకొట్టగా, రిషికి కేవలం 28 శాతం మంది మాత్రమే మద్ధతుగా నిలిచారు.
ఇద్దరి మధ్యా 32 శాతం ఓట్ల తేడా వుండటంతో బ్రిటీష్ తదుపరి ప్రధానిగా లిజ్ ట్రస్ బాధ్యతలు చేపడతారని కథనాలు వస్తున్నాయి.
అయితే తుది ఎన్నికలకు ఇంకా సమయం వున్నందున రిషి తనను తాను నిరూపించుకునేందుకు శ్రమిస్తున్నారు.
ఈ దశలో ఆయన తన ఇంటి స్విమ్మింగ్ పూల్ విషయంగా ఇబ్బందుల్లో పడ్డారు.ఇందులో విషయం ఏముందని మీరు అనుకుంటే పొరపాటే.
అది అలాంటి ఇలాంటి స్విమ్మింగ్ పూల్ కాదు. దాదాపు 3.8 కోట్ల రూపాయల వ్యయంతో అత్యంత విలాసవంతంగా రిషి సునాక్ దీనిని నిర్మిస్తున్నాడని ది ఇండిపెండెంట్ వార్తాసంస్థ నివేదించింది .ప్రస్తుతం ఇంగ్లాండ్ అత్యంత కరువును, హీట్ వేవ్ను ఎదుర్కొంటున్న సమయంలో ఆయన తీరు విమర్శలకు తావిస్తోంది.రిషి సునాక్ స్విమ్మింగ్ పూల్కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రిషి సునాక్ తన వారాంతాలను నార్త్ యార్క్షైర్లోని ఇంట్లో భార్య అక్షతామూర్తి , ఇద్దరు పిల్లలతో గడుపుతారు.
డైలీ మెయిల్ ప్రకారం.రిషి ఇందులో జిమ్, టెన్నిస్ కోర్టులను కూడా నిర్మిస్తున్నారు.
మరోవైపు శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని రిషి సునాక్ ఆయన భార్య అక్షతతో కలిసి భక్తివేదాంత మనోర్ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.హిందూమత విశ్వాసాలను గట్టిగా పాటించే రిషి సునాక్.2019లో హౌజ్ ఆఫ్ కామన్స్కు ఎన్నికైన సమయంలో భగవద్గీతపై చేతులు పెట్టి ప్రమాణం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.