కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డిఎ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థల హవా ఎక్కవైపోయింది.హిందూత్వ సంస్థలు మత మార్పిడుల పట్ల దృష్టి పెట్టాయి.
హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి వెళ్లినవారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకొచ్చే పని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగుతోంది.సంఘ్ పరివార్ ఈ కార్యక్రమానికి పెట్టిన పేరు ‘ఘర్ వాపసీ’.
అంటే ‘ఇంటికి తిరిగిరావడం’ అనే అర్ధం.హిందువులకు హిందూ మతం సొంత ఇల్లని, కొందరు దాన్ని వదిలిపెట్టి వేరే ఇళ్లకు అంటే ఇతర మతాల్లోకి వెళ్లారని, అలా వెళ్లినవారంతా తిరిగి సొంత ఇంటికి (హిందూ మతంలోకి) రావాలని కోరుతూ సంఘ్ పరివార్ సంస్థలు పెద్ద ఎత్తున మత మార్పిడి కార్యక్రమం నిర్వహిస్తున్నాయి.
ఇలా చేయడం లౌకిక వాదానికి (సెక్యులరిజం) విరుద్ధమని, ఎవరి ఇష్టం వచ్చిన మతం వారు అవలంబించే హక్కు ఉందని భాజపాయేతర పార్టీలు అంటున్నాయి.కాని దీన్ని ఆర్ఎస్ఎస్ పట్టించుకోవడంలేదు.
అందులోనూ కేంద్రంలో తమ ప్రభుత్వమే ఉండటంతో వారు ఘర్ వాపసీ కార్యక్రమాన్ని ఉధృతంగా చేపడుతున్నారు.ఇదిలా ఉంటే…రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ మత మార్పిడులకు మద్దతు పలికారని ఆర్ఎస్ఎస్ తాజాగా వెల్లడించింది.
ఏ మత మార్పిడులు? క్రిస్టియన్లు, ముస్లింలు తిరిగి హిందూ మతంలోకి రావడాన్ని ఆయన స్వాగతించారని , ఆ కార్యక్రమానికి సపోర్టు చేశారని తెలిపింది.ఆయన ఇస్లాం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడారని ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక ‘పాంచజన్య’ అంబేద్కర్ మీద ప్రచురించిన ప్రత్యేక సంచకలో పేర్కొంది.
పాకిస్తాన్లో హిందూమతం నుంచి ఇస్లాంలోకి బలవంతపు మత మార్పిడులు జరిగినప్పుడు అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించారని, హిందువులను మళ్లీ సొంత మతంలోకి ఆహ్వానించారని వివరించింది.అంబేద్కరను తెర మీదకు తేవడం ద్వారా ఆర్ఎస్ఎస్ ఘర్ వాపసీ కార్యక్రమాన్ని సమర్ధించుకుంది.
దీనిపై ముస్లిం, క్రిస్టియన్ సంస్థల, లౌకిక పార్టీల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.అంబేద్కర్ తన చివరి దశలో హిందూ మతాన్ని వ్యతిరేకించి బౌద్ధ మతం తీసుకున్నారు.