గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులను పొట్టనబెట్టుకున్న చైనా ఉన్మాదంపై యావత్ దేశం రగిలిపోతోంది.చైనాకు గట్టి గుణపాఠం నేర్పాలని.
యాప్స్ నిషేధిస్తే సరిపోదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు సైతం నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ వద్ద భారతీయ అమెరికన్లు భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
న్యూయార్క్, న్యూజెర్సీలలో నివసిస్తున్న ఇండో అమెరికన్లు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ (ఎఫ్ఐఏ) అధికారులతో పాటు టిబెట్కు చెందిన వారు, తైవానీస్ అమెరికన్స్ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు ‘‘ బాయ్కాట్ చైనా మేడ్ గూడ్స్, ‘‘ భారత్ మాతా కీ జై’’ అంటూ నినాదాలు చేశారు.అలాగే ‘‘అమరులైన భారత సైనికులకు వందనం’’ అనే ఫ్లకార్డులు ప్రదర్శించారు.
ఈ నిరసనలో పాల్గన్న టిబెట్ జాతీయులు సైతం. ‘టిబెట్ స్టాండ్ విత్ ఇండియా’ అంటూ తమకు చైనా నుంచి పూర్తి స్వాతంత్ర్యం రావాలని డిమాండ్ చేశారు.
చైనాను వాణిజ్యపరంగా బహిష్కరించేందుకు గాను భారత ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబే నేతృత్వంలోని ప్రపంచదేశాలన్నీ ఏకమవ్వాలని ఆందోళనకారులు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఇండో అమెరికన్ ప్రముఖుడు, జైపూర్ ఫుట్ యూఎస్ఏ అధ్యక్షుడు భండారి మాట్లాడుతూ.తమ దేశం 1962 నాటి భారత్ కాదని.చైనా దురాక్రమణను దాని బెదిరింపులను ఇక సహించలేమన్నారు.
డ్రాగన్ దురహంకారానికి గట్టి సమాధానం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.గాల్వన్ లోయలో చైనా సైనికులతో హింసాత్మక ఘర్షణలో 20 మంది జవాన్ల బలిదానం తమను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని విచారం వ్యక్తం చేశారు.