దేశంలో కొన్ని లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సినిమా రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.అయితే గతేడాది చైనా నుంచి కరోనా వైరస్ భారత్ కు వ్యాప్తి చెందడం, మన దేశంలో భారీగా కేసులు నమోదు కావడంతో కేంద్రం లాక్ డౌన్ ను అమలు చేయడం వల్ల థియేటర్లు మూతబడ్డాయి.
లాక్ డౌన్ నిబంధనల వల్ల స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాల షూటింగ్ లు కూడా ఆగిపోయాయి.
అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల థియేటర్లకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని లెక్కలు చెబుతున్నాయి.ఒక నివేదిక అంచనాల ప్రకారం గతేడాది బాక్సాఫీస్ కలెక్షన్లు గత సంవత్సరాలతో పోల్చి చూస్తే ఏకంగా 85 శాతం తగ్గడం గమనార్హం.2018 సంవత్సరంలో బాక్సాఫీస్ కలెక్షన్లు 4,422 కోట్ల రూపాయలుగా ఉండగా 2019 సంవత్సరంలో బాక్సాఫీస్ కలెక్షన్ల మొత్తం ఏకంగా 5,613 కోట్ల రూపాయలకు చేరింది.
అయితే 2020 సంవత్సరంలో బాక్సాఫీస్ కలెక్షన్లు మాత్రం కేవలం 825 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు 2,020 సంవత్సరంలో థియేటర్లకు నష్టం వాటిల్లిందని చెప్పాలి.అయితే థియేటర్లు మూతబడటం వల్ల థియేటర్ల ఖర్చులు సైతం నాలుగింట మూడు వంతులు తగ్గడం గమనార్హం.గతేడాది అక్టోబర్ 15 నుంచి కేంద్రం 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్లకు అనుమతులు ఇచ్చింది.
అయితే ప్రజలు మాత్రం థియేటర్లలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపకపోవడంతో కలెక్షన్లు తగ్గాయి.అయితే గత నెల 1వ తేదీ నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో అనుమతులివ్వడంతో థియేటర్లు కళకళలాడటంతో పాటు విడుదలైన సినిమాలు కలెక్షన్లపరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి.
ఈ ఏడాది విడుదలైన క్రాక్, రెడ్, జాంబీరెడ్డి, ఉప్పెన, నాంది సినిమాలు హిట్ కావడంతో పాటు భారీగా కలెక్షన్లను సాధించాయి.వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఉప్పెన సినిమా ఏకంగా 50 కోట్ల రూపాయల షేర్ సాధించడం గమనార్హం.