ముందు ఏదో ఒక ప్రకటన చేయడం ఆ తరువాత తీరిగ్గా నాలుక్కరుచుకుని అసలు ఆ మాటలే నేను అనలేదు అనడం రాజకీయ నాయకులూ షరా మాములు అయిపోయింది.ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ గందరగోళం తీవ్ర స్థాయిలో నెలకొంటూనే ఉంది.
రాజధాని విషయంలో మొదటి నుంచి అధికార పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ మాత్రమే స్పందిస్తూ వస్తున్నారు.ఇటీవల రాజధాని అంశంపై మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ శాసనసమండలిలో టీడీపీ సభ్యురాలు శమంతకమణి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
రాజధానిని మార్చబోము అన్నారు.అయితే మళ్లీ ఆ తరువాత బొత్స మాట మార్చారు.
రాజధానిపై కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే క్లారిటీ వస్తుందని, ఆ విషయాన్నీ అసెంబ్లీలో చర్చించిన తర్వాతే స్పష్టత వస్తుందని అన్నారు.రాజధాని రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హమీ ఇచ్చారు.
వాస్తవంగా రాజధాని అంశంపై గతంలో కూడా బొత్స చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.అయితే, కొన్ని రోజుల క్రితం అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన అధికారిక మ్యాప్లో ప్రకటించింది.
ఆ తర్వాత జరిగిన సీఆర్డీఏ సమీక్షలో సీఎం జగన్ కూడా రాజధానిలో ప్రాధాన్యతా క్రమంలో నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.మళ్లీ ఇప్పుడు బొత్స ఈ విధంగా ప్రకటన చేయడం చూస్తుంటే ప్రభుత్వంలోనే ఈ విషయంపై క్లారిటీ లేదు అన్నట్టుగా అర్ధం అవుతోంది.