భారతీయుల పర్వదినం దీపావళిని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు.అగ్రరాజ్యం అమెరికాలో సైతం దీపావళి వెలుగులతో, బాణాసంచా కాల్పులతో ధగధగలాడిపోతోంది.
వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలపై తొలిసారిగా దీపావళి థీమ్ని ప్రదర్శించారు.న్యూయార్క్లోని హడ్సన్ నదీ తీరంలో కళ్లు మిరుమిట్లు గొలిపేలా బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకొన్నారు.
ఇక్కడ మూడు రోజుల పాటు దీపావళీ వేడుకలు జరగనున్నాయి.అలాగే ప్రపంచ నలుమూలలా ఉన్న భారతీయులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.
అంతేకాకుండా స్వయంగా శ్వేతసౌధంలో దీపాలు వెలిగించిన ఫొటోను షేర్ చేసుకున్నారు.అటు అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హారిస్ కూడా ప్రపంచవ్యాప్తంగా వున్న భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఇక భారతీయ కమ్యూనిటీ పెద్ద సంఖ్యలో స్థిరపడిన బ్రిటన్లోనూ దీవాళిని ఘనంగా జరుపుకున్నారు.స్వయంగా యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, భారత సంతతికి చెందిన హోం సెక్రటరీ ప్రీతి పటేల్తో కలిసి ఆదివారం లండన్లోని ప్రఖ్యాత బీఏపీఎస్ శ్రీ స్వామి నారాయణ మందిర్లో భక్తులతో కలిసి దీపావళి, హిందూ నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు.
ఈ దేవాలయాన్ని ‘‘నీస్డెన్ టెంపుల్’’ అని కూడా పిలుస్తారు.
ఆలయ సందర్శనకు వచ్చిన బ్రిటీష్ ప్రధాన మంత్రికి బీఏపీఎస్ తరపున ఆయన ఏడాది కొడుకు విల్ఫ్రెడ్కు పొడవాటి చేతుల టీ షర్ట్ను అమీషా పటేల్ అనే ఏడేళ్ల బాలిక బహుకరించింది.
దీనితో పాటు ఆయన రెండవ బిడ్డ కోసం ఒక ‘‘అనెసీ’’ని అందించింది.స్టోన్ టెంపుల్ కాంప్లెక్స్ పర్యటనకు వచ్చిన జాన్సన్ను నిర్వాహకులు సాంప్రదాయ హిందూ పద్దతిలో స్వాగతించారు.
పింక్ లెహంగా ధరించిన హోం సెక్రటరీ ప్రీతి పటేల్ కూడా ప్రధానికి స్వాగతం పలికారు.అనంతరం ఇద్దరు కలిసి గర్భగుడి వద్ద స్వామి వారికి పండ్లను అందజేశారు.
అనంతరం వారిద్దరూ భగవాన్ స్వామి నారాయణుని యవ్వన రూపమైన శ్రీ నీలకంఠ వర్ణికి అభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా యూకేలోని భారతీయులకు జాన్సన్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక హోం సెక్రటరీ ప్రీతి పటేల్ తరచుగా ఈ ఆలయాన్ని దర్శిస్తూనే వుంటారు.ఆమె తాతగారు ఉగాండాలో బీఏపీఎస్ సంస్థకు ఛైర్మన్గా పనిచేశారు.
గుజరాత్లో జన్మించిన ప్రీతి తాతలు… 1950లలో ఉగాండాకు వెళ్లారు.ఆ తర్వాత వీరి కుటుంబాన్ని అప్పటి ఉగాండా అధ్యక్షుడు ఈదీ అమీన్ దేశం నుంచి బహిష్కరించడంతో పటేల్ తల్లిదండ్రులు బ్రిటన్కు వలస వెళ్లారు.