కరోనా కారణంగా థియేటర్లు అన్ని మూతపడ్డాయి.ఇక సినిమాలు రిలీజ్ చేసుకోలేని పరిస్థితి నెలకొని ఉంది.
చాలా సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యే సమయంలో కరోనా కారణంగా థియేటర్లు బంద్ కావడంతో నిర్మాతలు అందరూ అటు సినిమాని రిలీజ్ చేసుకోలేక, ఇటు సినిమాపై పెట్టిన పెట్టుబడికి వడ్డీలు కట్టుకోలేక చాలా మంది సతమతం అవుతున్నారు.ఇలాంటి సమయంలో నిర్మాతలకి ఆశాదీపంగా ఓటీటీ చానల్స్ వచ్చాయి.
థియేటర్లు మూతపడిన తర్వాత ఒక్కసారిగా ఓటీటీ సంస్థలు ఝూలు విదిల్చాయి.మార్కెట్ లోకి చొచ్చుకుపోవడానికి ఇదే సరైన సమయం అని భావించి ఇక రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలని డిజిటల్ రిలీజ్ చేసేందుకు నిర్మాతలకి పెద్ద మొత్తంలో రైట్స్ రూపంలో ఆశ చూపించాయి.
సినిమా మీద పెట్టిన పెట్టుబడికి రెట్టింపు సొమ్ము రైట్స్ రూపంలో ఇవ్వడానికి రెడీ కావడంతో నిర్మాతలు కూడా తమ సినిమాలని డిజిటల్ రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారు.
సౌత్ సినిమా నిర్మాతలు డిజిటల్ రిలీజ్ విషయంలో ఇంకా కొంత మంది వెనకడుగు వేస్తున్న బాలీవుడ్ నిర్మాతలు మాత్రం కరోనా సమయంలో ఇంతకంటే గొప్ప అవకాశం రాదని భావిస్తూ తమ సినిమాలని డిజిటల్ రిలీజ్ కి రెడీ చేసేస్తున్నారు.
కరణ్ జోహార్ లాంటి బడా నిర్మాత సైతం తన సినిమాలు డిజిటల్ రిలీజ్ కి ప్రాధాన్యత ఇస్తున్నాడు.ఈ నేపధ్యంలో కరోనా కష్టకాలంలో కూడా బాలీవుడ్ సినిమాలు ఏకంగా వెయ్యి కోట్ల బిజినెస్ చేశాయి.
ఓ విధంగా చెప్పాలంటే ఈ సమయంలో వెయ్యి కోట్లు బిజినెస్ అంటే చాలా గొప్ప విషయం అని చెప్పాలి.ఇక డిజిటల్ రైట్స్ లో అక్షయ్ కుమార్ లక్ష్మి బాంబ్ సినిమాకి అత్యధికంగా 125 కోట్ల రూపాయిలు డిస్నీ హాట్ స్టార్ చెల్లించింది.
తరువాత అజయ్ దేవగన్ రెండు సినిమాలకి 110 కోట్లు చెల్లించింది.ఇలా మొత్తంగా అమోజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, జీ5, సోనీ లైవ్ ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ ద్వారా బాలీవుడ్లో దాదాపు 1050 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది.
దీని వల్ల సదరు చిత్రాల నిర్మాతలకు కొంత ఆర్థిక చేయూత లభించింది.వీటిలో కొన్ని సినిమాలు ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ కాగా కొన్ని సినిమాలు త్వరలో రిలీజ్ కాబోతున్నాయి.
అయితే బాలీవుడ్ నిర్మాతలు డిజిటల్ పై చూపిస్తున్నంత శ్రద్ధ సౌత్ నిర్మాతలు, హీరోలు చూపించడం లేదు.