అమెరికా- కెనడా సరిహద్దుల్లో గడ్డ కట్టిన స్థితిలో ఓ భారతీయ కుటుంబం మరణించిన సంగతి తెలిసిందే.ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే.
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ వీరు ప్రాణాలు కోల్పోయారు.వీరి మరణంపై కెనడా, భారత ప్రభుత్వాలు తమ సంతాపం తెలియజేశాయి.
ఇప్పటికే పోస్ట్మార్టం పూర్తవ్వగా.మృతదేహాల గుర్తింపు కూడా జరిగింది.
అయితే వీరి అంత్యక్రియలపై సందిగ్థత నెలకొంది.ఈ క్రమంలోనే మృతుడు జగదీష్ పటేల్ బంధువు జశ్వంత్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మృతదేహాలను ఇప్పట్లో ఇండియాకు తీసుకువచ్చే ఉద్దేశ్యం లేదని తెలిపారు.తామంతా ఇంకా ఈ షాక్ నుంచి తేరుకోలేదని.
అందరం కలిసి చర్చించుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జశ్వంత్ చెప్పారు.కెనడాలోనే అంత్యక్రియలు జరిపించాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
కాగా.కెనడా- అమెరికా సరిహద్దుల్లో మరణించిన నలుగురు భారతీయుల మృతదేహాలను పోలీసులు ఇటీవల గుర్తించారు.వీరు భారత్లోని గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారిగా తేల్చారు.గత కొన్ని రోజుల నుంచి ఆ కుటుంబం కెనడాలో సంచరిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు.అయితే అమెరికా సరిహద్దుల వద్దకు వాళ్లను ఎవరు తీసుకువచ్చారన్నది మాత్రం తేలలేదు.మానవ అక్రమ రవాణా కేసుగానే దీనిని భావిస్తున్నారు.
జనవరి 12, 2022న వీరి కుటుంబం టొరంటోకు చేరుకుందని.అక్కడి నుంచి జనవరి 18న ఎమర్సన్కు వెళ్లారని కెనడా పోలీసులు చెబుతున్నారు.
మృతులను జగదీశ్ బల్దేవ్భాయ్ పటేల్(39), వైశాలీబెన్ జగదీశ్కుమార్ పటేల్(37), విహంగి జగదీశ్కుమార్ పటేల్(11), ధార్మిక్ జగదీశ్కుమార్ పటేల్(3)గా గుర్తించారు.వీరంతా ఒకే కుటుంబానికి చెందినవాళ్లు.కెనడా-అమెరికా బోర్డర్కు 12 మీటర్ల దూరంలో ఉన్న మానిటోబాలోని ఎమర్సన్ వద్ద ఆ నలుగురి మృతదేహాలను గుర్తించారు.వీరిది గుజరాత్లోని కలోల్ సమీపంలోని దింగుచా గ్రామం.జనవరి 26వ తేదీన మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించినట్లు కెనడా అధికారులు పేర్కొన్నారు.తీవ్రమైన చలి, ప్రతికూల వాతావరణ పరిస్ధితుల కారణంగానే ఆ నలుగురు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
వీరి మరణవార్తను కెనడా అధికారులు.భారత్లోని బంధువులకు తెలియజేశారు.
వీరి మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తవడంతో.తర్వాత జరగాల్సిన కార్యక్రమాల కోసం కెనడాలోని భారత రాయబార కార్యాలయం మృతుల కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతోంది.