ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన ఓ భారతీయుడు అనుకోని కారణాలతో హత్య కేసులో ఇరుక్కున్నాడు.బ్లడ్ మనీ పేరుతో రూ.2 కోట్లు నష్టపరిహారం చెల్లించి ఐదు నెలలైనా అతనికి విడుదల లభించలేదు.దీంతో ఆయన రాకకోసం కుటుంబ సభ్యులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.పంజాబ్ రాష్ట్రం ముక్తసర్ సమీపంలోని మల్లన్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల బల్వీందర్ సింగ్ అనే వ్యక్తి ఉపాధి కోసం 2008లో సౌదీ అరేబియాకు వెళ్లాడు.
ఈ నేపథ్యంలో 2013లో జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు.ఈ కేసులో బల్వీందర్ సింగ్ దోషిగా తేలాడు.
అయితే అతనిని క్షేమంగా భారతదేశానికి తీసుకురావడానికి కుటుంబం ఎన్నో కష్టాలు పడింది.దీనిలో భాగంగా విరాళాల ద్వారా రూ.2 కోట్లను సేకరించి ఈ ఏడాది మే నెలలో కేంద్ర ప్రభుత్వం ద్వారా బ్లడ్ మనీని చెల్లించింది.జూన్లో సౌదీ అరేబియా కోర్టు డబ్బును అంగీకరించిందని, బల్వీందర్ను రియాద్లోని జైలు నుంచి విడుదల చేసి మరో జైలుకు తరలించారని అతని కుటుంబం తెలిపింది.
ఈ మొత్తం వ్యవహారంపై బల్వీందర్ బంధువు హర్దీప్ సింగ్ మాట్లాడుతూ.2013లో పంజాబ్కే చెందిన వ్యక్తికి , సౌదీ అరేబియాకు చెందిన వ్యక్తికి మధ్య వివాదం జరిగిందని.దీనిని అడ్డుకునేందుకు బల్వీందర్ జోక్యం చేసుకున్నారని చెప్పారు.అయితే సౌదీ అరేబియా వ్యక్తి కత్తితో దాడికి దిగడంతో ఆత్మరక్షణ కోసం బల్వీందర్ అతనిని కర్రతో కొట్టాడని హర్దీప్ తెలిపారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలో వుండి ప్రాణాలు కోల్పోయాడని.ఈ కేసులో దోషిగా తేలిన బల్వీందర్కు కోర్ట్ ఏడేళ్ల జైలు శిక్ష విధించిందని ఆయన వెల్లడించారు.
అయితే మృతుడికి కుటుంబానికి రూ.కోట్ల బ్లడ్ మనీ చెల్లించాలని.లేనిపక్షంలో శిరచ్ఛేదం జరపాలని కోర్ట్ ఆదేశించింది.దీంతో భయపడిన బల్వీందర్ కుటుంబ సభ్యులు రూ.2 కోట్లు చెల్లించిందని.అయినప్పటికీ ఇంత వరకు ఆయను విడుదల చేయలేదని హర్దీప్ తెలిపారు.
పాటియాలాకు చెందిన బల్వీందర్ సింగ్ బంధువు మాట్లాడుతూ…సౌదీలో తమకు తెలిసిన వ్యక్తి వేరే ప్రాంతానికి బదిలీ కావడంతో సాయం అందడం లేదని వాపోయాడు.ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేశామని.అలాగే ఇతర దేశాలలో పలుకుబడి వున్న కొందరిని సంప్రదించామని ఆయన తెలిపారు.