తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పధకాలలో మరో ముఖ్య పధకం దళిత బంధు.దేశ రాజకీయాలు మొత్తం కులాల ఆధారంగా మతాల ఆధారంగా జరుగుతున్నాయనే విషయం మనకు తెలిసిందే.
అయితే ముఖ్యంగా దళితులను ఆర్థికంగా బలోపేతం చేస్తామని గత కొన్ని దశాబ్దాలుగా చాలా ప్రభుత్వాలు హామీలు ఇచ్చినా దళితుల అభ్యున్నతికి పటిష్టమైన చర్యలు తీసుకోలేదు.అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒకడుగు ముందుకేసి దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటిస్తూ దళిత బంధు పధకాన్ని ప్రకటించింది.
అయితే ఈ పధకంతో ఒక్క సారిగా ప్రతిపక్షాలు తమ ఉనికికి నష్టం కలుగుతుందనే భావనలో సరికొత్త విమర్శలకు తెరదీస్తున్నారు.ముఖ్యంగా దళిత బంధు పధకం అమలు క్రెడిట్ ను పొందాలని తహతహ లాడుతున్న పరిస్థితి ఉంది.
అయితే దళిత అధికారులకు ముఖ్యమైన బాధ్యతలను అప్పగించలేదని దళిత అధికారుల పట్ల ప్రభుత్వం తీరు సరికాదని బీజేపీ గొంతెత్తిన తరువాతే దళిత అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని బీజేపీ వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది.
అంతేకాక దళితులకు మూడు ఎకరాల భూమి కేటాయింపు విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చామని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు విషయంలో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించామని తద్వారానే ప్రభుత్వం దళితులకు ప్రత్యేక శ్రద్ద పెట్టిందని అందులో భాగంగానే దళిత బంధు పధకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని బీజేపీ ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది.
దళితులకు ప్రభుత్వం నుండి ఎంతో కొంత లబ్ధి చేకూరుతుందంటే దానికి బీజేపీ దళిత పక్షాన చేసిన పోరాటమే ప్రధాన కారణమని వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది.ఎందుకంటే టీఆర్ఎస్ బలంగా ప్రచారం చేసే అంశాలలో దళిత బంధు పధకం ఒకటి.
మరి ఈ బీజేపీ ప్రచారం పట్ల టీఆర్ఎస్ అయితే ఇప్పటికైతే స్పందించకపోయినా మరి భవిష్యత్తులో స్పందిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.