దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయాయి.బీజేపీ పై చేయి సాధించింది.
ఇప్పుడు అందరి దృష్టి నాగార్జునా సాగర్ ఉప ఎన్నిక మీదే ఉంది.ఈ ఉప ఎన్నిక కారు పార్టీలో కలవరం రేపుతోన్న మాట వాస్తవం.
ఇక్కడ పోటీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య ఉంటుందా ? లేదా టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఉంటుందా ? అన్నదే ఇప్పుడు పెద్ద సస్పెన్స్.దుబ్బాక, గ్రేటర్ ఫలితాలు కమలం పార్టీలో ఎంతో ఉత్సాహం నింపుతుండగా సాగర్లో మాత్రం ఆ పార్టీ పప్పులు ఉడికేలా లేవు.
ఆ మాటకు వస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏ ఎన్నిక జరిగినా బీజేపీకి డిపాజిట్ రావడమే గొప్ప.అసలు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి మూడు వేల ఓట్లు కూడా రాలేదు.
ఇక ఇప్పుడు ఆంధ్రా సరిహద్దులో.అది కూడా కాషాయ దళానికి ఏ మాత్రం పట్టులేని చోట జరుగుతోన్న ఉప ఎన్నిక కావడంతో బీజేపీ పరిస్థితి ఏందన్నది సహజంగానే ఆసక్తి రేపుతోంది.
అసలు సాగర్ నియోజకవర్గ ఓటరు తీర్పు ఎలా ఉండబోతోందని ఇప్పటికే బీజేపీ అక్కడ ఓ సర్వే చేయించుకుందట.అయితే ఈ సర్వేలో బీజేపీకి 5-6శాతం మాత్రమే ఓట్లు వచ్చాయట.
అందుకే అలెర్ట్ అయిన బీజేపీ వాళ్లు ఇటీవల ఒక కొత్త ప్రచారం మొదలుపెట్టారట.
టీఆర్ఎస్ – కాంగ్రెస్ సాగర్ ఉప ఎన్నిక కోసం కుమ్మక్కు అయ్యాయని.తమను ఓడించడానికి ముందే చేతులు కలిపేశారని అక్కడ బీజేపీ సరికొత్త పల్లవి అందుకుందని అంటున్నారు.గత ఎన్నికల్లో బీజేపీకి కేవలం 5 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఇప్పుడు ఎంత కష్టపడినా మరో ఒకటి రెండు శాతం ఓట్లు పెరగడం మినహా చేసేదేం లేదంటున్నారు.ఇక బీజేపీ చేయించిన సర్వేలో కూడా టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కే 2 శాతం ఓట్లు ఎక్కువ వస్తాయని తేలిందట.
ఇక ఇటు జనా రెడ్డి సైతం ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే ఆ క్రెడిట్ కొత్త పీసీసీ అధ్యక్షుడికి పోతుందని.అందుకే ఇక్కడ ఉప ఎన్నిక తర్వాత కొత్త పీసీసీ అధ్యక్షుడి పేరు ప్రకటించమని సూచించారట.
మరి అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో ? గాని మొత్తానికి సాగర్లో కమలానికి షాక్ తప్పదని తెలుస్తోంది.