తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.పార్టీ అదిష్టానం ఆదేశాలతో రాష్ట్ర బీజేపీ నాయకులు సరికొత్త ప్లానింగ్తో ముందుకెళ్తున్నారు.
టీఆర్ ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇప్పటికే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర మొదలు పెట్టారు.మొదటి విడత పాదయాత్ర త్వరలో ముగియనుంది.
అసెంబ్లీ ఎన్నికలకు ఇంక రెండు సంవత్సరాలు ఉండడంతో ఐదు విడతల్లో సంగ్రామ పాదయాత్ర చేపట్టాలని బీజేపీ ఇప్పటికే ప్లాన్ సిద్ధం చేసింది.
తొలి విడత పాదయాత్ర హైదరాబాద్ లోని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి హుజూరాబాద్ వరకు సాగనుంది.
ఇప్పటికే వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, కామారెడ్డి జిల్లా మీదుగా సిరిసిల్లకు పాదయాత్ర చేరుకుంది.అక్టోంబర్ 2 న త్వరలో ఉప ఎన్నిక జరగబోయే హుజూరాబాద్లో పాదయాత్ర ముగించనున్నారు.
పాదయాత్ర ముగింపు సభ హుజూరాబాద్లో నిర్వహించేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారు.ఈ సభలో బండి సంజయ్ కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే శ్రేణులను సన్నద్ధం చేయాలనే ఉద్దేశంతో 20 నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ముందస్తుగా ఎలాంటి సమస్య లేని, అశావహులు లేని చోట్ల తమ అభ్యర్థులను ప్రకటించే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది.
పాదయాత్ర సాగించిన జిల్లాలలో ఆయా అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని సంజయ్ బావిస్తుండగా, బీజేపీ అధిష్టానం మాత్రం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలుస్తోంది.అయితే అన్ని పార్టీల కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని కమలనాథులు బావిస్తుండగా అదిష్టానం నుంచి ఎలాంటి సపోర్ట్ లేదని సమాచారం.తెలంగాణలో అధికారం హస్తగతం చేసుకోవాలని చూస్తున్నబీజేపీ రాష్ట్ర నాయకులకు అదిష్టానం తీరు అర్థం కావడం లేదు.
ప్రజా సమస్యలపై టీఆర్ ఎస్ ప్రభుత్వంపై తాము పోరాటం చేస్తుంటే.అటు అదిష్టానం మాత్రం కేసీఆర్ తో సఖ్యాతగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోందని బీజేపీ నాయకులు చర్చించుకుంటున్నారు.