ప్రస్తుత దేశవ్యాప్తంగా బీజేపీకి పెరిగిన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని తాము బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడే బలపడాలని ఆ పార్టీ చూస్తోంది.అందుకే దక్షిణాది మీద ఎక్కువ దృష్టిపెట్టింది.
ఇప్పటికే తెలంగాణాలో రోజు రోజుకి బలం పెంచుకుంటూ ముందుకు వెళ్తున్న ఆ పార్టీ ఏపీ విషయంలో మాత్రం వెనుకబడిపోయింది.ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకుంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం బాగా బలహీనంగా ఉండడంతో రూటు మార్చాలని చూస్తోంది.
అసలు తెలంగాణాలో బలపడుతున్న స్థాయిలో ఏపీలో బలపడకపోవడానికి కారణం ఏపీలో వైసీపీ ప్రభుత్వం బాగా బలంగా ఉండడడమే కారణం అని బీజేపీ భావిస్తోంది.అందుకే వైసీపీ విషయంలో టీడీపీ ఫార్ములాను ఉపయోగించాలని బీజేపీ ఫిక్స్ అయ్యిందట.
ఇప్పటికే వైసీపీ మీద విమర్శల దాడి మొదలుపెట్టినా ఆ పార్టీ నుంచి పెద్దగా రియాక్షన్ లేదు.అదీ కాకుండా ప్రభుత్వం ఏర్పడి కేవలం రెండు నెలలే కావడంతో ఇప్పటి నుంచే విమర్శలు తీవ్రత పెంచితే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో ఈ ఏడాది చివరి వరకు సైలెంట్ గా ఉండాలని బీజేపీ నిర్ణయం తీసుకుందట.
వైసీపీ బీజేపీ మిత్రపక్షంగానే ప్రజలందరూ భావిస్తున్నారు.అదీ కాకుండా వైసీపీ అధికారంలోకి రావడానికి బీజేపీ తెర వునుక కృషి చేసిందన్న సంగతి అందరికి తెలిసిందే.ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే కక్ష సాధింపు చర్యలకు దిగేకంటే గతంలో టీడీపీ విషయంలో ఏ విధంగా అయితే వ్యవహరించామో ఆ విధంగానే స్పందించాలని బీజేపీ భావిస్తోందట.2014 ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో పాటు నాలుగేళ్లపాటూ టీడీపీ బీజేపీ కలిసిమెలసి తిరిగాయి.కానీ ఆ తర్వాత పొమ్మనలేక పొగబెట్టినట్లు వ్యవహరించడంతో తప్పని పరిస్థితుల్లో బీజేపీకి గుడ్ బై చెప్పక తప్పలేదని అప్పట్లో టీడీపీ బీజేపీపై ఫైర్ అయ్యారు.ఏడాది కాలంలో ఎన్నికలు ఉండగా టీడీపీని టార్గెట్ చేస్తూ బీజేపీ రకరకాలుగా ఇబ్బందులు పెట్టి విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేసింది.
కేంద్రం ఇవ్వాల్సిన నిధుల విషయంలోనూ ఇదే ధోరణితో వ్యవహరించడంతో టీడీపీ అన్ని విధాలుగా నష్టపోయింది.
అయితే టీడీపీ కి ఇచ్చినంత సమయం వైసీపీకి ఇవ్వకూడదని బీజేపీ ఆలోచనట.
ఎందుకంటే 2022లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్న బీజేపీ ఆ సమయంలోగా వైసీపీపై ఎంత వీలైతే అంతగా విమర్శలు, ఆరోపణలు చేసేందుకు ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.ఐతే వైసీపీకి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ రావడంతో ఆ పార్టీని అధికారం నుంచి దించేయడం అంత తేలిక కాదని భావిస్తున్న బీజేపీ వేరే ప్లాన్ వేసిందట.
ఏపీలో అవినీతి జరగకుండా పరిపాలన సాగిస్తామని వైసీపీ చెబుతుండటంతో… అదే అవినీతి అస్త్రాన్ని ఆ పార్టీపై ప్రయోగిస్తూ ఎక్కడ ఏ అవినీతి జరుగుతోందో పరిశీలన చేసి దాన్ని హైలెట్ చెయ్యాలని బీజేపీ చూస్తోందట.దీనికి జనవరి నెలను ముహూర్తంగా పెట్టుకున్నారట.
మరోవైపు చూస్తే జగన్ మాత్రం బీజేపీతో వైరం పెట్టుకునే ఆలోచనలో లేడు.వీలైనంత వరకు ఆ పార్టీతో సన్నిహితంగా ఉంటూనే ఏపీకి నిధులు పెద్ద ఎత్తున తీసుకురావాలని జగన్ చూస్తున్నాడు.