ఏపీ ప్రభుత్వ విషయంలో మెతక వైఖరితో ఉంటే, ఎప్పటికీ ఇక్కడ బలపడలేమనే అభిప్రాయానికి వచ్చిన బిజెపి జగన్ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.అలాగే క్రమక్రమంగా టిడిపి, వైసిపిలను బలహీనం చేసి, బలమైన పార్టీగా ఏపీలో చక్రం తిప్పాలనే అభిప్రాయంలో ఆ పార్టీ ఉన్నట్లుగా కనిపిస్తోంది.
అందుకే తమకు దొరికిన ఏ చిన్న అవకాశాన్ని అయినా, వదిలి పెట్టకుండా వాడుకోవాలని చూస్తోంది.ప్రస్తుతం ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాల విషయంలో జగన్ ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
దేశవ్యాప్తంగా ఈ విషయంలో జగన్ మొదటి స్థానంలో నిలుస్తున్నారు.పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది సమయంలోనే, అన్ని సంక్షేమ పథకాలు ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరంగా అందిస్తుండడం పై ఆయనకు ప్రశంసలు దక్కుతున్నాయి.
ఇప్పటి వరకు ఈ విషయంలో మౌనంగా ఉన్న బీజేపీ ఇప్పుడు ఆ పథకాల క్రెడిట్ అంతా తమ ఖాతాలోనే పడాలి అన్నట్టుగానే వ్యవహరిస్తోంది.అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఏపీ ప్రభుత్వం పేర్లు మార్చి, తమ గొప్పతనం గా చెప్పుకుంటూ లబ్ధి పొందుతుందని ఏపీ బీజేపీ నాయకులు గుర్రుగా ఉన్నారు.
అందుకే జగన్ ప్రవేశపెట్టిన పథకాలు చాలావరకు కేంద్రం భాగస్వామ్యం ఉందని, ఆ క్రెడిట్ అంతా తమకు దక్కాలనే కొత్త డిమాండ్ తెరపైకి తెస్తున్నారు.కేంద్రం పెద్దఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే, వాటికి వైసిపి ప్రభుత్వం సొంత పేర్లను పెట్టుకుని ప్రజల్లో క్రెడిట్ పొందుతుందని, ఇకపై ఆ విధంగా చేస్తే ఊరుకునేది లేదంటూ బీజేపీ నేతలు కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు.
ఈ మేరకు వైసీపీ ప్రభుత్వానికి వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు.ఇకపై కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవి అమలు చేసినా, ఖచ్చితంగా కేంద్రం భాగస్వామ్యం ఉందని ప్రచారం చేయాలని, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోలు తప్పనిసరిగా వాడాలని, అలా చేయకపోతే ఆ పథకాలకు అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించాలని వార్నింగ్ ఇస్తున్నారు.
గతంలోనూ టిడిపి, బిజెపి పొత్తు పెట్టుకున్న సమయంలో ఈ వ్యవహారం బాగానే నడిచినా, ఆ తరువాత రెండు పార్టీల మధ్య పొత్తు రద్దయిన తర్వాత కూడా బిజెపి నాయకులు ఇదే రకంగా డిమాండ్ వినిపించారు.కేంద్ర ప్రభుత్వ పథకాలను టిడిపి యధేచ్ఛగా తమ ఖాతాలో వేసుకుని ప్రచారం పొందుతోందని, అప్పట్లో బిజెపి నాయకులు ఆందోళన చేశారు.
ఇప్పుడు జగన్ తో వ్యవహారం బెడిసికొట్టడంతో ఇప్పుడు అదే రకంగా విమర్శలు చేస్తున్నారు.కాకపోతే ఈ విమర్శలను జగన్ పెద్దగా పట్టించుకునే అవకాశం లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు.కాకపోతే బీజేపీ మాత్రం ఈ విషయంలో సీరియస్ గానే ఉన్నట్టుగా వ్యవహరిస్తోంది.ఇప్పటి వరకు మామూలుగానే ఈ వ్యవహారాలు నడిచినా ముందు ముందు జగన్ కు ఇబ్బందికర పరిణామాలు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.