జనసేన బీజేపీ పొత్తులు ఒకపక్క కొనసాగుతుండగానే , తెలుగుదేశం పార్టీ జనసేన తో పొత్తు పెట్టుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తోంది.అయితే ఈ విషయంలో పవన్ ఇంకా ఆచితూచి వ్యవహరిస్తుండడం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
అయితే ఎన్నికల సమయం నాటికి పొత్తు ఉంటుందని బలంగా నమ్ముతోంది.ప్రస్తుతం ఏపీ అధికార పార్టీ వైసీపీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవడం, కాస్త ప్రజావ్యతిరేకత పెరగడం, రాబోయే ఎన్నికల నాటికి అది మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉండడంతో, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి జనసేన కాంబినేషన్ లో ఎన్నికలకు వెళితే తప్పకుండా అధికారం సాధిస్తామనే అంచనాలో తెలుగుదేశం పార్టీ ఉంది.
అందుకే జనసేన తో పొత్తు పెట్టుకునేందుకు తహతహలాడుతోంది.అయితే ఈ వ్యవహారాలన్నీ ఏపీ బీజేపీ కి మింగుడు పడడం లేదు.
జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయని సందర్భం వచ్చినప్పుడల్లా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటిస్తూనే ఉన్నారు.జనసేన మద్దతు కోసం ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పైన బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు .అయితే పవన్ నిర్ణయం ఏంటి అనే దానిపైన బీజేపీ కూడా ఆసక్తిగానే ఎదురుచూస్తోంది.తాజాగా పొత్తుల వ్యవహారం పై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై నాయకులు, కార్యకర్తలతో చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామంటూ చెప్పడం తెలుగుదేశం పార్టీలో ఆశలు రేకెత్తించాయి.
కానీ బీజేపీలో ఆందోళన కనిపిస్తోంది. జనసేన ద్వారా రాజకీయంగా బలపడాలని అధికారం వైపు అడుగులు వేయాలని చూసిన బీజేపీ నేతలకు ఇప్పుడు జనసేన టిడిపికి దగ్గరవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
అదీకాకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏపీలో జనసేన దీక్షలు చేపట్టడం బీజేపీ కి ఇబ్బందికరంగా మారింది.అలా అని జనసేన ను కట్టడి చేసేందుకు గట్టిగా ప్రయత్నం చేయలేని పరిస్థితి బీజేపీ కి ఏర్పడింది.