తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.ఖాళీ అయిన ఆరు స్థానాలతో పాటు, మరో స్థానం టిఆర్ఎస్ కు దక్కబోతోంది.
దీంతో ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో కేసీఆర్ ఎవరికి అవకాశం కల్పిస్తారనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది.ఇప్పటికే ఈ స్థానాల్లో పోటీ కోసం దాదాపు 60 మంది వరకు నేతలు ఆశలు పెట్టుకున్నారు.
గతంలో కేసీఆర్ ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని ఎంతోమందికి హామీలు ఇవ్వడం, ఇతర పార్టీల నుంచి కీలకమైన నాయకులను చేర్చుకునే సమయంలోనూ వారికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పడం, తదితర కారణాలతో పోటీలో చాలామంది ఆశావాహులు ఉన్నారు.వీరంతా నియోజకవర్గ స్థాయిలో కీలకమైన నేతలు కావడంతో కెసిఆర్ అభ్యర్థుల ప్రకటన చేయగానే టిఆర్ఎస్ లో అసంతృప్తి, అలకలు తీవ్రంగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. సరిగ్గా ఈ అవకాశం కోసమే తెలంగాణ బిజెపి కాచుకుని కూర్చుంది.హుజురాబాద్ ఉప ఎన్నికలలో బిజెపి గెలవడానికి కారణం ఇక్కడి నుంచి పోటీ చేసిన ఈటెల రాజేందర్ బలమైన అభ్యర్థి కావడమే.
దీంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ హుజురాబాద్ తరహా ఫలితం దక్కాలి అంటే తప్పనిసరిగా ఆయా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను ఎన్నికల్లో పోటీకి దించాలని బిజేపి అభిప్రాయపడుతోంది.అయితే ప్రస్తుతం బిజెపి ఉన్న పరిస్థితుల్లో చాలా నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే వారు లేరు.
దీంతో టీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున బలమైన వారిని గుర్తించి, వారిని ఎన్నికల్లో పోటీకి దించాలని బిజెపి ప్లాన్ చేస్తోంది.ప్రస్తుతం ఎమ్మెల్సీ స్థానాల్లో తమకు అవకాశం దక్కుతుందని చాలా మంది టిఆర్ఎస్ నాయకులు ఎదురుచూపులు చూస్తున్నారు.
కెసిఆర్ ప్రకటన వెలువడిన తర్వాత చాలామంది అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంటుందని బిజెపి అంచనా వేస్తోంది.అటువంటి నేతలను బీజేపీ లో చేర్చుకొని ఆయా నియోజకవర్గాల్లో వారిని అభ్యర్థులుగా ప్రకటిస్తే ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందనే అంచనాలోతెలంగాణ బిజెపి నాయకులు ఉన్నారట.బిజెపిలో అసంతృప్తికి గురైన నాయకులకు టికెట్ హామీ ఇవ్వడంతో పాటు, అనేక రకాలుగా పార్టీ అండగా నిలబడుతుందనే హామీలు ఇచ్చి పార్టీలో చేర్చుకోవాలనే ప్లాన్ లో బిజేపి ఉన్నట్టు సమాచారం.అందుకే కేసీఆర్ నిర్ణయం కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆశావాహులు కంటే ఎక్కువగా బిజెపి వెయిట్ చేస్తోందట.
అయితే బీజేపీ ప్లాన్ ను టీఆర్ఎస్ ఏ విధంగా తిప్పికొడుతుందో చూడాలి.