పైకి అంతా నిశ్శబ్దంగానే ఉన్నా, ఏపీ బీజేపీలో మాత్రం ఏదో పెద్ద అలజడి జరుగుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.తెలుగుదేశం పార్టీ క్రమక్రమంగా బలహీనపడుతున్న తరుణంలో, ఏపీలో ఇదే సమయంలో బలపడితే రాజకీయంగా అధికారం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయనే ఆలోచనతో ఉన్న బీజేపీ పెద్దలు దానికనుగుణంగానే ఏపీలో రాజకీయాలు వేడెక్కించే పనిలో ఉన్నారు.
తమతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీతో కలిసి 2024 ఎన్నికల నాటికి అధికారంలోకి రావాలని చూస్తున్నారు.దీనిలో భాగంగానే పార్టీలోని నాయకులు అందరిని దారిలో పెట్టి, పార్టీలో నూతనోత్సాహం తీసుకువచ్చే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుగా కనిపిస్తున్నారు.
ప్రస్తుత బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పని తీరుపై అసంతృప్తితో ఉన్న అధిష్టానం పెద్దలు, ఆయనను తప్పించి మరొకరికి ఆ బాధ్యతలు అప్పగించాలని ఎప్పటి నుంచో ఎదురు చూపులు చూస్తున్నారు.
కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పార్టీకి పెద్దగా ఊపు రాలేదని, నాయకులను సమన్వయం చేసుకుంటూ, ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకువెళ్లే విషయంలో విఫలమయ్యారని అధిష్టానం నమ్ముతోంది.
ఈ నేపథ్యంలో ఆయనను తప్పించి పార్టీ పగ్గాలు వేరొకరికి అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో పార్టీ లో యాక్టివ్ గా ఉంటూ, బీజేపీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే నాయకుడి కోసం అధిష్టానం పెద్దలు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సోము వీర్రాజు పేరును ముందుగా పరిగణనలోకి తీసుకున్నారు.ఆయన బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో, ఈ సమీకరణాలు కలిసొస్తాయని భావించినా ఆయనపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉండటంతో పాటు, స్వతంత్రంగా దూకుడుగా వ్యవహరిస్తారనే అభిప్రాయంతో ఆయన పేరును హోల్డ్ లో పెట్టారట.అలాగే పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళుతూ, తమ రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్న యువ నేత విష్ణువర్ధన్ రెడ్డి పేరును అధిష్టానం ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.మీడియా సమావేశాల్లో కానీ, వైసీపీ ప్రభుత్వం, టిడిపి ఎలా వారు వీరు అనే తేడా లేకుండా ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలో విష్ణువర్ధన్ రెడ్డి ముందు నుంచీ యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు.
అటువంటి ఫైర్ బ్రాండ్ నాయకుల వల్లే పార్టీ బలపడుతుందని నమ్ముతున్న అధిష్టానం పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి పేరును దాదాపుగా ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు త్వరలోనే బీజేపీలో సమూల మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది.