ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 అసెంబ్లీ సీట్లు, 22 లోక్ సభ సీట్ల తో చాలా బలంగా ఉంది.టిడిపి 23 అసెంబ్లీ సీట్లు, మూడు లోక్ సభ సీట్లతో బలహీనంగా ఉంది.
అయితే ఇదంతా జరగడానికి సగం కారణం బీజేపీ.ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదు అనే ఏకైక కారణంతో వైసీపీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ఆ పార్టీ అధికారంలోకి వచ్చేలా బిజెపి చేయగలిగింది.
ఇక ఆ తర్వాత టీడీపీ టార్గెట్ గా ఆ పార్టీ నుంచి బిజెపిలోకి కీలక నాయకులు వలసలు వచ్చేలా చేయగలిగింది.నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రభావితం చేయగలిగిన నాయకులను చేర్చుకుని బిజెపి పంతం ఎలా ఉంటుందో రుచి చూపించింది.
ఇంత వరకు బాగానే ఉన్నా, ప్రస్తుతం బిజెపి ధోరణి కొద్ది రోజులుగా తేడాగా కనిపిస్తోంది.
తమ ప్రధాన శత్రువు చంద్రబాబు కాదని, వైసీపీ అని అందరికీ అర్థమయ్యేలా బీజేపీ నాయకులతో విమర్శలు చేయిస్తోంది.ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో మంత్రి గా ఉన్న బొత్స సత్యనారాయణ, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారు బిజెపిలో చేరాలని చూస్తున్నారని, కానీ పార్టీ మారితే వేటు తప్పదని జగన్ సంకేతాలు ఇస్తుండడంతో కాస్త వెనక్కి తగ్గుతున్నారు అంటూ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు.అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రి బిజెపి నాయకురాలు పురంధరేశ్వరి కూడా టిడిపి, వైసిపిలను విమర్శించారు.
టిడిపి కుల పార్టీ అని, వైసిపి మత పార్టీ అంటూ ఆమె విరుచుకుపడ్డారు.ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా సైతం టిడిపి ప్రభుత్వం ఎన్నో అవినీతి, అరాచకాలు చేసిందని, ప్రస్తుతం వైసీపీ కూడా అదే బాటలో నడుస్తోందంటూ విమర్శలు గుప్పించారు.
ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీ నాయకులు వరుసగా టిడిపి తో పాటు వైసీపీ ని కూడా గట్టిగా విమర్శించడం వెనుక కారణాలు కూడా కనిపిస్తున్నాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో బలపడేందుకు బిజెపి చాలా కాలంగానే ప్రయత్నిస్తోంది.అందుకే ముందుగా అక్కడ పరిస్థితులు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించింది.బీజేపీతో చంద్రబాబు బహిరంగంగానే తలపడ్డారు.
కానీ తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ తమతో సన్నిహితంగా ఉంటూనే తెరవెనుక బిజెపి బలపడకుండా కుట్రలు చేస్తున్నారని బీజేపీ పెద్దలు అనుమానిస్తున్నారు.ఇప్పటికే కర్ణాటకలో దూకుడుగా ముందుకు వెళ్తున్న బిజెపి తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా మాటల దాడి పెంచడమే కాకుండా ఆ పార్టీ నుంచి బిజెపిలోకి వలసలు పెరిగేలా చేసింది.
ప్రస్తుతానికి బిజెపి ఫోకస్ అంతా ఏపీలో వైసిపి ప్రభుత్వం మీద పెట్టింది.అయితే దీనివల్ల జగన్ కు ప్రస్తుతానికి వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు కానీ ముందు ముందు కేంద్రంతో అనేక పనులు నిధులు విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది.