తిరిగి తమ పూర్వ వైభవం సంపాదించుకునేందుకు ఏపీ తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.ప్రభుత్వం నుంచి ఎన్ని వేధింపులు ఎదురవుతున్నా నాయకులు ఎవరూ బయటకి వెళ్లకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.
పార్టీ నాయకుల్లో ఉన్న భయాన్ని పోగొట్టి పూర్వపు వైభవాన్ని సంపాదించేందుకు టీడీపీ తీవ్రంగా కృషి చేస్తోంది.అయినా ఆ పార్టీ నాయకుల్లో ఉన్న భయం మాత్రం పోవడంలేదు.
అందుకే వారు ఆందోళనతో ఇతర పార్టీల వైపు చూస్తున్నట్టు కనిపిస్తోంది.అయితే ప్రస్తుతం ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరదామంటే ఆ పార్టీ అధినేత జగన్ పెట్టిన నియమ నిబంధనలు అడ్డంకిగా మారాయి.
ఈ నేపథ్యంలో అందరి చూపు బీజేపీ మీదే పడుతోంది.బీజేపీ కూడా ఏపీలో బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండడంతో ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నాయకులను చేర్చుకోవాలని చూస్తున్నారు.
తెలంగాణ, ఆంధ్ర రెండు చోట్ల బలపడి వచ్చే ఎన్నికలనాటికి బలమైన శక్తిగా మారాలని ప్రయత్నాలు చేస్తోంది.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నట్టు కనిపిస్తోంది.
ఇక పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది.టీడీపీ రోజు రోజుకు బలహీనపడుతుండగా, జనసేన ఇప్పట్లో అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదనే అభిప్రాయానికి బీజేపీ పెద్దలు వచ్చేసారు.
అందుకే అధికార పార్టీ వైసీపీకి ప్రత్యామ్న్యాయం తామే అన్నట్టుగా బీజేపీ డిసైడ్ అయిపొయింది.దీనిలో భాగంగానే టీడీపీ, జనసేన పార్టీల్లో ప్రజా బలం ఉన్న నాయకులను బీజేపీలోకి చేర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చేశారు.
మరోవైపు చూస్తే బీజేపీకి దగ్గరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తుంటే చంద్రబాబును దూరం పెట్టాలని బీజేపీ అధిష్టానం నుంచి రాష్ట్ర నాయకులకు ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది.టీడీపీని పూర్తిగా అణచివేసేందుకు ఆ పార్టీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది.
అందుకు తగ్గట్లే ఎన్నికల తర్వాత చాలా మంది టీడీపీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు.ఇప్పట్లో టీడీపీ కోలుకోలేదని భావిస్తున్న ఆ నేతలకు బీజేపీలోకి జంప్ అవ్వడం మినహా మరో మార్గం లేదనే ఆలోచనకు వచ్చేశారు.
ఎందుకంటే ఇటువంటి జంపింగ్లకు వైసీపీ అధినేత జగన్ ముందే బ్రేక్ వేశారు.ఎవరు పార్టీలో చేరాలన్నా ప్రస్తుతం ఉన్న పార్టీకి రాజీనామా చేసి మాత్రమే తన పార్టీలో చేరాలని చెప్పేయడంతో అంతా బీజేపీ వైపే చూస్తున్నారు.వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించేశారు.చాలా మంది టీడీపీ నుంచీ బీజేపీలో చేరారు.
మరికొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.పార్టీ సభ్యత్వాలు కూడా ఏపీలో బాగా పెరుగుతున్నాయి.
ఇక జనసేన పార్టీ విషయాన్ని కూడా బీజేపీ లైట్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది.జనసేన పార్టీ అనేదే రాష్ట్రం లేదని, పవన్ కల్యాణ్ కి వ్యక్తిగతంగా మాత్రమే స్టార్ ఇమేజ్ ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తీసిపారేస్తున్నారు.
ఆయనకు వ్యవస్థాగతమైన ఆలోచన విధానం లేదనీ, సుదీర్ఘ కాలంపాటు రాజకీయాల్లో కొనసాగే అవకాశం కనిపించడం లేదని అయన చెబుతున్నారు.ఆ పార్టీ నాయకులు చాలామంది తమ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.