ఏపీలో ఇప్పటివరకు ఉందా లేదా అన్నట్టుగా ఉన్న కేంద్ర అధికార పార్టీ బీజేపీ ఇక రాబోయే ఎన్నికలు… తమ ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు ని ఎదుర్కోవడమే లక్ష్యంగా స్పీడ్ పెంచింది.ఏదో ఒకరకంగా టీడీపీని మట్టికరిపించేందుకు చంద్రబాబు మీద విమర్శల బాణాలు వదలాలని బీజేపీ ప్లాన్ చేసుకుంది.
దీనిలో భాగంగానే….ఈనెల 4వ తేదీ నుంచి బీజేపీ నాయకులు బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు.
మొత్తం 15 రోజుల పాటు జరగనున్న ఈ బస్సు యాత్ర దాదాపు 85 నియోజకవర్గాలను కవర్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.ఫిబ్రవరి 4 వ తేదీన పలాసలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.
అక్కడి నుంచి బయలుదేరిన బస్సు యాత్ర కర్నూలు జిల్లాలో ఆదోని వరకు సాగుతుంది.
ఈ యాత్రలోనే బీజేపీ తన వ్యూహాలకు పదునుపెడుతోంది.ఎందుకంటే చంద్రబాబు గత కొంతకాలంగా బీజేపీకి కంటిలో నలుసులా మారాడు.అంతే కాకుండా….
కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ తన ఖాతాలో వేసుకుంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా రాష్ట్రంలో పెద్దయెత్తున దుర్వినియోగం జరిగాయని వారు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలేంటి? అవి రాష్ట్రంలో ఎలా అమలు జరుగుతున్నాయి? పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇంతవరకూ చేసిందేమిటి.? కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో జరిగిన తంతు ఏమిటన్న విషయాలను ఈ బస్సుయాత్ర ద్వారా ప్రజలకు అర్ధం అయ్యేలా వివరించాలని బీజేపీ నాయకులు స్కెచ్ సిద్ధం చేస్తున్నారు.
ప్రస్తుతం ఏపీలో బీజేపీకి ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది.గత ఎన్నికల్లో టీడీపీతో కలసి పోటీ చేసిన బీజేపీ నాలుగు అసెంబ్లీ స్థానాలను, రెండు పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది.కనీసం అదే సంఖ్యలోనైనా ఈసారి ఎన్నికల్లో గెలుచుకుని తమ బలం నిరూపించుకోవాలని చూస్తోంది.అందుకే… తెలంగాణ బీజేపీ బలంగా ఉన్నప్పటికీ మొన్నటి ఎన్నికల్లో నామమాత్రంగా ప్రభావం చూపించింది.కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ఏపీకి మోదీ ఏమీ చేయలేదన్న ప్రచారం ఇప్పటికే బలంగా ప్రజల్లోకి వెళ్లడంతో దానిపై జనానికి వివరణ ఇవ్వాలని నిర్ణయించి బస్సు యాత్రను ప్రారంభించనుంది.
ఇక్కడే చంద్రబాబు చేసిన మోసాలన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లి టీడీపీ హవా తగ్గించాలని చూస్తోంది.
అలాగే.ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఏపీ పర్యటన ఖరారయిపోయింది.ఈ నెల 10వ తేదీన గుంటూరులోనూ, 16వ తేదీన విశాఖపట్నంలో జరిగే సభల్లో ఆయన పాల్గొని చంద్రబాబు ప్రభుత్వం మీద భారీ విమర్శలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
మొత్తంగా చూస్తే బీజేపీ ఏపీలో బలపడాలనే ఆలోచన ఎలా ఉన్నా.టీడీపీ గెలవకూడదు అనే దృఢమైన అభిప్రాయంతో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది.