తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు బీజేపీ పెద్ద ఎత్తుగడ వేసింది.ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, వాటిని అమలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తెలంగాణ ప్రజలకు తాము మేలు చేస్తున్నట్లుగా వ్యవహరించి, తమ పరపతిని పెంచుకునేందుకు బిజెపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిలో భాగంగానే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ దరఖాస్తుల ఉద్యమాన్ని ప్రారంభించారు.బిజెపి కార్యకర్తలు స్వయంగా వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిదారులు వద్దకు వెళ్లి, దరఖాస్తులు స్వీకరిస్తారని, వాటిని తాసిల్దార్ కలెక్టర్ ముఖ్యమంత్రికి పంపిస్తారని సంజయ్ చెప్పారు.
టిఆర్ఎస్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకానికి తాము ఏమాత్రం అభ్యంతరం చెప్పడం లేదని, హుజురాబాద్ లో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంబించడాన్ని స్వాగతిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.అయితే కేవలం ఈ పథకాన్ని నియోజకవర్గానికే పరిమితం చేయకుండా, రాష్ట్రం అంతటా అమలు చేయాలనేదే తమ డిమాండ్ అన్నారు.
అలాగే బీసీ గిరిజన బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మంది బీసీ, 10 లక్షల మంది గిరిజన, ఆదివాసి కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని డిమాండ్ చేశారు.
గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన నిరుద్యోగ భృతి, రైతులకు రుణమాఫీ, గిరిజనులకు మూడు ఎకరాల భూమి, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం వంటి హామీలు ఏమయ్యాయి ? పేదలందరికీ రెండు పడక గదుల ఇల్లు నిర్మిస్తామని, స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేస్తామని చెప్పి మర్చిపోయారు.2014 ఎన్నికల్లో దళిత గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన హామీ కూడా నెరవేరలేదు అంటూ సంజయ్ విమర్శలు చేశారు.అయితే ఈ విమర్శలపై తాజాగా తెలంగాణ మంత్రి , టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
దేశ వ్యాప్తంగా ప్రతి పౌరుడికి 15 లక్షలు ఇస్తానని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు బీజేపీ తెలంగాణ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను.తెలంగాణ ప్రజలు యువకులు అందరూ తెలంగాణ బిజెపి నేతలకు దరఖాస్తులు ఇవ్వండి.మీ జన్ దన్ అకౌంట్ లోకి డబ్బులు వస్తాయి.అంటూ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా విమర్శలు చేశారు.