ఏదో పొత్తు పెట్టుకున్నాము తప్ప , జనసేనకు తమకు, పెద్ద సంబంధం ఏమి లేదు అన్నట్లు గా వ్యవహరించిన ఏపీ బీజేపీ నేతలకు ఇప్పుడు జనసేన అవసరం బాగా పడింది.జనసేన సహకారం లేకపోతే, ఏపీలో తాము ఏపీలో పాగా వేయడం కష్టం అనే విషయం అర్థమైంది.
చెప్పుకోవడానికి జాతీయ పార్టీగా బీజేపీ ఉన్న, క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం లేకపోవడం, ఏపీలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బీజేపీ పట్టు సంపాదించడం వంటి కారణాలతో జనసేన అవసరం బీజేపీకి బాగా వచ్చిపడింది.కానీ ఇప్పటి వరకు జనసేన ను తేలికగా తీసుకున్నా, ప్రస్తుత ఎన్నికల సమయంలో ఆ పార్టీ సహకారం లేకపోతే పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తుతుంది అనే అభిప్రాయానికి వచ్చిన ఏపీ బీజేపీ నేతలు, పవన్ ను ప్రసన్నం చేసుకునేందుకు అనేక తంటాలు పడుతున్నారు.
ప్రస్తుతం తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ బీజేపీ తరఫున రత్నప్రభ పోటీ చేస్తున్నారు.
ఇక్కడ గెలవాలి అంటే ఖచ్చితంగా జనసేన మద్దతు , పవన్ ప్రచారం బీజేపీకి తప్పనిసరి.కానీ ఆయన ఎన్నికల ప్రచారానికి వస్తారో లేదో అనుమానం గా ఉండడంతో, పవన్ ను ప్రసన్నం చేసుకునేందుకు బిజెపి అనేక మార్గాలను వెతుక్కుంటూ వస్తోంది.
దీనిలో భాగంగానే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ప్రకటన చేశారు.జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే, పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు అంటూ వీర్రాజు ప్రకటించారు.
తాజాగా జనసేన బిజెపి సమన్వయ కమిటీ సమావేశం లో ఈ వ్యాఖ్యలు చేశారు.అయితే ఇదే వీర్రాజు కొద్ది నెలల క్రితం సీఎం అభ్యర్థి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
బిజెపి జనసేన కూటమి గెలిస్తే బిసి ని ముఖ్యమంత్రి చేస్తాము అంటూ ఆయన వ్యాఖ్యానించారు.ఇది అప్పట్లో పెద్ద దుమారం రేపింది.
వీర్రాజు వ్యాఖ్యలపై జనసేన తీవ్రంగా మండిపడింది.
పవన్ ను సీఎం అభ్యర్థి రేసు నుంచి తప్పించేందుకు వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు అని , అసలు ఇంతగా తమ పార్టీ నీ, తమ అధినేతను అవమానిస్తున్న బీజేపీ తో పొత్తు రద్దు చేసుకుంటేనే మంచిది అనే జనసేనలో వినిపించే వి.ఇక తెలుగుదేశం పార్టీకి జనసేన దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది అనే అనుమానం రావడంతోనే పవన్ ను ప్రసన్నం చేసుకుని తిరుపతిలో గట్టెక్కేందుకు వీర్రాజు ద్వారా బీజేపీ అధిష్టానం ఈ వ్యాఖ్యలు చేయించినట్లు అర్థమవుతోంది.