బీజేపీతో పొత్తు పెట్టుకున్నామనే ఆనందం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కొద్ది రోజులకే ఆవిరయ్యింది.ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం ద్వారా ఏపీ రాజకీయాల్లో పవన్ తనకు తిరుగు ఉండదని ముందుగా ఊహించుకున్నారు.
అలాగే ఢిల్లీ రాజకీయాల్లోనూ చక్రం తిప్పవచ్చని భావించారు.కానీ వాస్తవం లోకి వచ్చేసరికి బిజెపి అగ్రనాయకులు పవన్ పెద్దగా పట్టించుకోనట్టు గా వ్యవహరిస్తున్నారు.
అయితే జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత పవన్ కు మోదీ అమిత్ షా దర్శనం ఇప్పటివరకు దక్కలేదు.వారి అపాయింట్మెంట్ కోసం పవన్ చేయని ప్రయత్నం అంటూ లేదు.
కొద్ది రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన పవన్ మోదీ, అమిత్ షాలను కలిసేందుకు అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు.అది సాధ్యంవక్కపోవడంతో బిజెపి లో ఉన్న మిగతా నాయకులను కలుస్తూ అపాయింట్మెంట్ కోసం వారితో చర్చిస్తున్నారు.అయినా పవన్ కు ఆ అవకాశం వచ్చేలా కనిపించకపోవడంతో ఏపీకి వెళ్లిపోవాలని ఆ తర్వాత సరైన సమయంలో అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాలని కొంతమంది బిజెపి నాయకులు పవన్ కు సూచిస్తున్నారు.పవన్ మాత్రం వారిని కలవకుండా ఏపీకి వెళ్తే తన పరువు పోతుంది అనే భావంతో అక్కడే మకాం వేశారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తాను నిద్రపోనని, ఈ విషయంలో తనకు బీజేపీ మద్దతు కూడా లభించిందని, అసలు సిసలైన రాజకీయం చూస్తారు అంటూ పవన్ పార్టీ నుంచి వ్యాఖ్యలు వినిపించాయి.అయితే బిజెపి మాత్రం ఈ విషయంలో ముందుకు రావడం లేదు.పవన్ చెప్పినట్లు వ్యవహారాలు చేసేందుకు ఆ పార్టీ పెద్దలు ఇష్టపడడం లేదు.ఇక అమరావతి విషయంలోనూ బిజెపి వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది.దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఫిబ్రవరి 2వ తేదీన లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని చెప్పినా అకస్మాత్తుగా వాయిదా వేశారు.ఇక జరిగే అవకాశం కనిపించడం లేదు.
జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లకుండా బిజెపి ప్రభుత్వం సైలెంట్ గా ఉంది.అసలు శాసన మండలి రద్దు వ్యవహారం లో బీజేపీ జగన్ తో ఈ విధంగా చేయించిందనే వార్తలు కూడా పవన్ కి కూడా నిద్ర పట్టనీయడంలేదు.ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు ద్వారా తాను రాజకీయంగా అప్పుడే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అనే భావంతో పవన్ ఉన్నట్టుగా తెలుస్తోంది.నిజంగా మోదీ, అమిత్ షాల అపాయింట్మెంట్ కనుక పవన్ కు దక్కకపోతే రాజకీయంగా ఆయన మరిన్ని విమర్శలు ఎదుర్కోక తప్పదు.