రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ముందుకు పోయింది కమలదళం.కేంద్రంలో అధికారం ఖాయం అన్న తరుణంలో మోడిగారు సీమాంధ్రపై వరాల జల్లు కురిపించారు.
అనేక హామీలను చల్లేసి చల్లగా జారుకున్నారు.పోలవరం ప్రాజెక్టు, జాతీయ విద్యా సంస్ధలు మినహా మిగిలిన హామీలు ఎప్పుడు నెరవేరతాయనే అంశంపై అయితే అసలు స్పష్టత లేదు.
పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్తో ఆర్థిక ఇబ్బందులలో ఉన్న రాష్ట్రం హామీల అమలు కోసం కేంద్రం వైపు చూస్తుంది.ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు కేంద్రానికి వివరించేందుకు ఈనెల 12న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహా పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరించనున్నట్లు సమాచారం.ఆంధ్రప్రదేశ్ను అన్ని రకాలుగా ఆదుకుంటామని రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం పార్లమెంట్లో హామీ ఇవ్వడమే కాకుండా విభజన బిల్లులోనూ పొందుపరిచారు.
ఇక ప్రత్యేక హోదాపై కేంద్రం సరికొత్త పాటాన్ని అందుకుంది.వెంకయ్య నాయుడు మాటాడుతూ ప్రత్యేక హోదా కల్పించాలి అంటే మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకారం తెలపాలని అందుకే తామిచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా పేరుతో కాకుండా మరోలా ప్రయోజనాలు అందేలా చూస్తామని కేంద్రం ఆంధ్రప్రదేశ్కు హామీ ఇచ్చినట్లు తెలిసింది.
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెవెన్యూ లోటు మొత్తం పూడ్చుతామని ఇచ్చిన హామీని కేంద్రం పక్కన పెట్టిం ది.వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం నిధులు ఇస్తా మని కేంద్రం వెల్లడించింది.రాష్ట్రంలో మొత్తం ఏడు జిల్లాలకు రూ.24వేల కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించి.దీనిపై ఇప్పటివరకు కేంద్రం నోరు మెదపలేదు.మరి అన్ని విధాలా ఆదుకుంటాం అని ఆశలు రేపి ఇప్పుడు మొహం చాటేయ్యడం ఎంతవరకు సమంజసమో కేంద్రానికే తెలియాలి.