బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ కార్యక్రమంలో అమరావతి వ్యవహారంపై చర్చిస్తున్న సమయంలో అమరావతి జేఏసీ నాయకుడు శ్రీనివాస్ విష్ణువర్ధన్ రెడ్డి పై చెప్పుతో దాడికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.లైవ్ డిబేట్ లో ఈ వ్యవహారం చోటుచేసుకోవడంతో, క్షణాల్లో ఆ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లైవ్ డిబేట్ నిర్వహిస్తున్న ఆ ఛానెల్ యాంకర్ వెంకట కృష్ణ ఈ వ్యవహారంపై పశ్చాతాపం వ్యక్తం చేయడం, మరోసారి ఈ దాడికి పాల్పడిన శ్రీనివాస్ ను ఛానెల్ డిబేట్ కార్యక్రమాలకు పిలవము అని ప్రకటించడం వంటివి చోటు చేసుకున్నాయి.అయితే అదే ఛానెల్ మరోసారి స్టూడియో కి శ్రీనివాస్ ను పిలిచి ఈ సంఘటనపై అతని వివరణ ప్రచారం చేయడం వంటివి చోటు చేసుకోవడంపై ఏపీ బీజేపీ సీరియస్ అయ్యింది.
ఈ చెప్పు దాడి వ్యవహారంలో సదరు ఛానెల్ తప్పిధమే ఎక్కువ ఉంది అని ఏపీ బీజేపీ అభిప్రాయపడింది.ఈ మేరకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ని ఏపీ బీజేపీ శాఖ బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది.
అసలు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ దాడి జరిగిన వెంటనే ఘాటుగా స్పందిస్తూ మాట్లాడారు.అప్పటికే విష్ణువర్ధన్ రెడ్డి అదే ఏబీఎన్ స్టూడియోలో ఉన్నారు.
చెప్పు దాడికి పాల్పడిన శ్రీనివాసరావు పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయించాలని వీర్రాజు అప్పుడే డిమాండ్ చేశారు.ఇక ఏబీఎన్ లో ఆ తర్వాత రోజు శ్రీనివాసరావు ఎందుకు దాడికి పాల్పడాల్సి వచ్చిందో మొత్తం ఏబీఎన్ ప్రచారం చేసింది.
అమరావతి ఉద్యమాన్ని కించపరుస్తూ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడడం తోనే ఈ దాడికి పాల్పడినట్లు శ్రీనివాసరావు చెప్పారు.
అలాగే ఎన్నో అంశాల గురించి శ్రీనివాస్ చెప్పిన మాటలు ఏబీఎన్ ప్రచారం చేసింది.దీనిపై ఏపీ బీజేపీ సీరియస్ అయింది.ఈ వ్యవహారం ఇక్కడితో వదలకూడదు అని, ఇకపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి బహిష్కరించాలని, ఏ మీడియా సమావేశాలకు సదరు ఛానల్, పత్రికను పిలవకుడదు అని, అలాగే బీజేపీ నాయకులు ఎవరూ ఆ ఛానల్ లో నిర్వహించే డిబేట్ కార్యక్రమాలలో పాల్గొనకూడదని, బీజేపీ కి సంబంధం లేని వారిని తీసుకువచ్చి వారే బీజేపీ ప్రతినిధులుగా చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూ, కేసులు పెడతామని ఏపీ బిజెపి శాఖ హెచ్చరించింది.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఈ వ్యవహారంపై క్షమాపణ చెప్పే వరకు తాము ఆ ఛానల్, పత్రిక విషయంలో ఇదే విధంగా వ్యవహరిస్తామని ఏపీ బీజేపీ శాఖ ప్రకటించింది.